Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు మేలును ప్ర‌జ‌లు మ‌రిచార‌ట‌.. య‌న‌మ‌ల కామెడీ!

By:  Tupaki Desk   |   23 Dec 2019 4:30 PM GMT
చంద్ర‌బాబు మేలును ప్ర‌జ‌లు మ‌రిచార‌ట‌.. య‌న‌మ‌ల కామెడీ!
X
తెలుగుదేశం హ‌యాంలో ఆ పార్టీకి వ్య‌తిరేక‌త ప్ర‌బ‌లే ప‌నులు చేసిన వారిలో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కూడా ముందుంటారు. త‌ను సింగ‌పూర్ కు వెళ్లి పంటి చికిత్స చేయించుకుని వ‌చ్చారు య‌న‌మ‌ల‌. సొంత డ‌బ్బులతో సింగ‌పూర్ కు వెళ్లి చికిత్స చేయించుకున్నా, అమెరికాకు వెళ్లి కాలిలో ముళ్లు తీయించుకుని వ‌చ్చినా న‌ష్టం లేదు. అయితే ప్ర‌జ‌ల సొమ్ముతో సింగ‌పూర్ వ‌ర‌కూ వెళ్లి చిన్న వైద్యం చేయించుకుని వ‌చ్చిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి అంటూ అప్ప‌ట్లో య‌న‌మ‌ల పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది.

అలాంటి య‌న‌మ‌ల ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు చేసిన మేళ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్ర‌బాబు నాయుడు ఎంతో మేలు చేస్తే.. ప్ర‌జ‌లు  మ‌రిచిపోయారంటూ నిందిస్తున్నారు కూడా!

చంద్ర‌బాబు హ‌యాంలో ఉత్త‌రాంధ్ర ఒక రేంజ్ లో డెవ‌ల‌ప్ అయిపోందంట‌. ఐటీ కంపెనీల‌ను తెచ్చార‌ట ఉత్త‌రాంధ్ర‌కు. ఇదీ య‌న‌మల వారి ఉవాచ‌. మూడు రాజ‌ధానులు, మూడు ప్రాంతాలు అని జ‌గ‌న్ అంటుంటే.. య‌న‌మ‌ల దాన్ని వ్య‌తిరేకిస్తూ ఉన్నారు. అందులో భాగంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు.

చంద్ర‌బాబు ఉత్త‌రాంధ్ర‌ను ఉద్ధ‌రించార‌ట‌. ఇప్పుడు విశాఖ‌కు క్యాపిట‌ల్ అవ‌స‌రం లేద‌ట‌. ఇవ‌న్నీ య‌న‌మ‌ల మాట‌లే. అయితే చంద్ర‌బాబు చేసిన మేలును ప్ర‌జ‌లు అర్థం చేసుకోకుండా ఆయ‌న‌ను ఓడించార‌ట‌. జ‌గ‌న్ మాత్రం ఫ్యాక్షన్ సంస్కృతిని మూడు ప్రాంతాల్లోనూ విస్త‌రించ‌డానికి మూడు రాజ‌ధానులు పెడుతున్నార‌ట‌. ఇలాంటి మాట‌లు మాట్లాడాలంటే తెలుగుదేశం నేత‌ల‌కే సాధ్యమేమో!