Begin typing your search above and press return to search.

భారత్ లో యాహూ మూసివేత .. యాహూ మెయిల్స్‌ సంగతేంటి

By:  Tupaki Desk   |   26 Aug 2021 10:30 AM GMT
భారత్ లో యాహూ మూసివేత .. యాహూ మెయిల్స్‌ సంగతేంటి
X
ప్రముఖ వెబ్‌ సర్వీసుల ప్రొవైడర్‌ యాహూ, భారత్‌ లో న్యూస్‌ ఆపరేషన్స్‌ ను నిలిపివేసింది. 20 ఏళ్ల సేవలకు ఈ రోజుతో పుల్‌ స్టాప్‌ పెట్టింది. ఈ మేరకు న్యూస్‌ ఆధారిత వెబ్‌ సైట్ల కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించిన యాహూ, భారత్ లో మెయిల్‌ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. అమెరికాకు చెందిన వెబ్‌ సేవల కంపెనీ యాహూ, ఇవాళ్టి నుంచి వార్తా సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. గురువారం నుంచి ఎలాంటి కొత్త కంటెంట్‌ను పబ్లిష్‌ చేయకపోవడం విశేషం. అయితే ఈ షట్‌డౌన్‌తో మిగతా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా, ఎలాంటి కంటెంట్‌ను పబ్లిష్‌ చేయబోదు. యాహూ అకౌంట్‌తో పాటు మెయిల్‌, సెర్చ్‌ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది. ఇక ఈ ప్రకటనతో యాహూ న్యూస్‌, యాహూ క్రికెట్‌, ఫైనాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, మేకర్స్‌కు సంబంధించిన కంటెంట్‌ నిలిచిపోనుంది. ఎఫ్‌డీఐ కొత్త రూల్స్‌, విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది.

డిజిటల్‌ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, అదీ కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే కొత్త చట్టాలు అనుమతించనున్నాయి. అక్టోబర్‌ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానుంది. డిజిటల్‌ కంటెంట్‌, ముఖ్యంగా యాహూ క్రికెట్‌పై ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా యాహూ సేవలు ప్రీమియం, లోకల్‌ కంటెంట్‌ అందిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్‌కి పర్యాయపదంగా యాహూను, అమెరికా టెలికం దిగ్గజం వెరిజోన్‌ 2017లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

డిజిట‌ల్ ప్లాట్‌ ఫామ్‌ లో విదేశీ పెట్టుబ‌డులు 26శాతానికి ప‌రిమితం చేయ‌డంతో దానికి త‌గ్గ‌ట్టుగా త‌మ స‌ర్వీసుల‌కు న‌డ‌ప‌లేమ‌ని చెప్పి యాహు కంపెనీ యాహు న్యూస్‌, యాహు బిజినెస్‌, యాహు క్రికెట్ త‌దిత‌ర వెబ్ స‌ర్వీసుల‌కు ఇండియాలో నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అయితే, యాహులోని మెయిల్ ఖాతాదారుల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని యాహు వెబ్ స‌ర్వీస్‌ ను నిర్వ‌హిస్తున్న వేరిజాన్ మీడియా తెలియ‌జేసింది.