Begin typing your search above and press return to search.

సాములోరి మీద కోపం.. యాదాద్రిని యాదగిరి గుట్టగా మార్చేసింది

By:  Tupaki Desk   |   3 April 2022 12:30 PM GMT
సాములోరి మీద కోపం.. యాదాద్రిని యాదగిరి గుట్టగా మార్చేసింది
X
పెద్ద సారా మజాకానా? ఆయన అనుకోవాలే కానీ ఏదైనా ఇట్టే జరిగిపోతుంది. తాజాగా బయటకు వచ్చిన ఈ విషయాన్ని చూస్తే అర్థమవుతుంది. కొన్ని దశాబ్దాల నుంచి యాదగిరి గుట్టగా ఉన్న పుణ్యక్షేత్రాన్ని యాదాద్రిగా మారుస్తూ ఆ మధ్యన సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి మించిన రీతిలో ఒక పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉండటం.. అందుకు అనువుగా రాష్ట్రంలో అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటైన యాదగిరి గుట్టను పూర్తిగా మార్చేయాలన్న సంకల్పాన్ని తీసుకోవటం తెలిసిందే.

దీనికి సంబంధించిన బాధ్యతను త్రిదండి చిన జీయర్ స్వామికి అప్పజెప్పటం తెలిసిందే. ఈ సందర్భంగా యాదగిరి గుట్టను యాదాద్రిగా పిలిస్తే బాగుంటుందన్న సూచనతో పాటు భద్రాచలాన్ని భద్రాద్రిగా కూడా పిలిస్తే బాగుంటుందని చెప్పటం.. అందుకు ఆయన వెంటనే ఓకే చెప్పటం తెలిసిందే. అప్పటి నుంచి యాదగిరి గుట్టను యాదాద్రిగా.. భద్రాచలాన్ని భద్రాద్రిగా వ్యవహరించటం తెలిసిందే. ఆ తర్వాతి కాలంలో పలుమార్లు యాదాద్రికి వెళ్లిన సందర్భంగా సీఎం కేసీఆర్ సైతం.. పుణ్యక్షేత్రాన్ని యాదాద్రిగా సంబోధించటం తెలిసిందే.

ఇందుకు భిన్నంగా అక్కడి స్థానికులు మాత్రం యాదగిరి గుట్టగా.. గుట్టగా పిలుస్తుంటారు. అయితే.. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ యాదాద్రిగా పిలవటం తెలిసిందే. ఈ పేరు అందరి నోళ్లల్లో నానటంతో చాలా తక్కువ వ్యవధిలోనే యాదాద్రి పేరుగా ఫిక్స్ అయిపోయిన పరిస్థితి.

అయితే.. కొద్దిరోజుల క్రితం చినజీయర్ స్వామికి.. సీఎం కేసీఆర్ కు మధ్య పొరపొచ్చాలు రావటం.. చూస్తుండగానే అవి అంతకంతకూ ముదిరిపోయిన పరిస్థితి. మొన్నటికి మొన్న యాదగిరి గుట్ట మీద నిర్వహించిన మహా సంప్రోక్షణ కార్యక్రమానికి జీయర్ స్వామికి ఆహ్వానం కూడా పంపని వైనంతో కేసీఆర్ మొండితనం.. ఆయన పట్టుదల ఏంతలా ఉంటాయన్న విషయం ఇట్టే అర్థమైంది.

తాజాగా యాదాద్రిని ఆ పేరుతో కాకుండా పాత పేరైన యాదగిరి గుట్టగా పిలిచేలా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతారు. ఇదంతా చూసినప్పుడు పెద్ద సారుకు నచ్చినప్పుడు ఒకలా.. నచ్చనంతనే అప్పటికే ఉన్న పేరును మార్చేస్తూ నిర్ణయం తీసుకోవటం చూస్తే.. చేతిలో అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చన్న మాటకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్తగా పెట్టిన యాదాద్రి పేరును తిరిగి యాదగిరి గుట్టగా మార్చేయటం చూస్తే.. పెద్దసారూ మజాకానా? అన్న భావన కలుగక మానదు.