Begin typing your search above and press return to search.

అమ్మో న‌న్ను ఇండియాకు పంపిస్తారా... ఆత్మ‌హ‌త్య చేసుకుంటా

By:  Tupaki Desk   |   7 Nov 2019 3:06 PM GMT
అమ్మో న‌న్ను ఇండియాకు పంపిస్తారా... ఆత్మ‌హ‌త్య చేసుకుంటా
X
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడు వేల‌కోట్లు టోపీ పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ సంచ‌ల‌న వార్త‌ల‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు. ఇటీవ‌లే...ఆయ‌న‌కు లండన్‌ కోర్టు మరోసారి బెయిల్‌ ను తిరస్కరించింది. నేరస్తుల అప్పగింత కింద అప్పగించడంపై సవాల్‌ చేస్తూ నీరవ్‌ పిటిషన్‌ దాఖలు చేయ‌గా...న్యాయ‌స్థానం షాకిచ్చింది. ఇలా బెయిల్ పిటిషన్‌ ను తిరస్కరించడం ఇది నాలుగోసారి. ఇలా ప్రతీసారి బెయిల్ తిరస్కరణకు గురవుతుండటంతో తనను ఇండియాకు తీసుకొస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీరవ్ మోదీ బెదిరించాడు.


నీరవ్ మోదీతో పాటూ ఆయన బంధువు మోహుల్ చోక్సీ కూడా పీఎన్‌బీ స్కామ్ కేసులో నిందితుడే. అయితే ఈ కుంభకోణం వెలుగులోకి రాకముందే వీరిద్దరూ గత ఏడాది జనవరిలోనే దేశం విడిచి పారిపోయారు. నీరవ్ మోదీ ప్రస్తుతం సౌత్ వెస్ట్ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. ఇండియాకు చెందిన దర్యాప్తు సంస్థలు మరియు కోర్టులు నీరవ్ మోదీకి ఎన్నోసార్లు సమన్లు ఇచ్చినప్పటికీ ఆయన ఇండియాకు తిరిగి రాలేదు. అందువల్ల నీరవ్ మోదీని కేసు దర్యాప్తు కోసం తమకు అప్పగించాలని లండన్ ప్రభుత్వాన్ని ఇండియన్ గవర్నమెంట్ కోరుతోంది. మ‌రోవైపు బెయిల్ ఇవ్వాల‌ని నీర‌వ్‌మోదీ కోరుతున్నారు. హుగో కీత్‌ క్యూసి అనే న్యాయసంస్థ నీరవ్‌ తరపున వాదిస్తోంది. అయితే, నీరవ్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వస్తున్న అభ్యర్ధనలను లండన్‌ చీఫ్‌ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బథ్‌నాట్‌ తిరస్కరించారు. ఈ పిటిషన్‌ పై విచారణ వచ్చే ఏడాది మే నెల నుంచి ప్రారంభిస్తామని లండన్‌ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.

దీంతో 48 ఏళ్ల నీరవ్‌ మోడీ లండన్‌లోని వెస్ట్‌మినిష్టర్‌ కోర్టు తీర్పుల నేప‌థ్యంలో...త‌న ప‌రిస్థితి గురించి వాపోతూ...తనను ఇండియాకు తీసుకొస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. కాగా, నీరవ్ మోదీకి బెయిల్‌ మంజూరు చేయాల్సిన పరిస్థితులను మాత్రం బయటకు తెలపలేమని, విచారణ పూర్తయ్యేంత వరకూ రహస్యంగానే ఉంచుతామని యుకె క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ ప్రతినిధులు తెలిపారు.