Begin typing your search above and press return to search.

ఏపీలో దారుణ ఘటన మద్యానికి డబ్బు ఇవ్వలేదని భార్య , కూతురిని !

By:  Tupaki Desk   |   16 Aug 2021 6:34 AM GMT
ఏపీలో దారుణ ఘటన  మద్యానికి డబ్బు ఇవ్వలేదని భార్య , కూతురిని !
X
ఏపీలో ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మృగంలా మారాడు. అనుమానం, ఆపై తాగడానికి డబ్బులివ్వలేదన్న కోపంతో కట్టుకున్న భార్య, కుమార్తె పై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడు. దీనితో తీవ్రగాయాలైన కుమార్తె ప్రియాంక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. భార్య ఆసుపత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లాలోని మాచవరంలో చోటుచేసుకుంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మాచవరం గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన సుశీలతో సుమారు 30 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ దంపతులకు మానసిక వైకల్యంతో పోరాడుతున్న ప్రియాంక అనే 27 ఏళ్ల వయసున్న కుమార్తె ఉంది. అయితే, మద్యానికి బానిసైన శ్రీనివాసరెడ్డి భార్యపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ శనివారం మద్యానికి డబ్బులివ్వాలని సుశీలతో గొడవ పడ్డాడు.

ఆమె ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. ముందు రాత్రి 10గంటల సమయంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో చుట్టుపక్కనున్న వారు వచ్చి సముదాయించారు. ఈ క్రమంలో డాబాపైకి వెళ్లి శ్రీనివాసరెడ్డి నిద్రించాడు. తల్లీ కుమార్తెలు ఇంటిలో నిద్రపోయారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 12.30 సమయంలో మిద్దె పైనుంచి కిందికి దిగి వచ్చిన శ్రీనివాసరెడ్డి, అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ ను తల్లీ, కూతుళ్లపై పోసి నిప్పంటించాడు. మంటలు వ్యాపించడంతో వారు మేల్కొని పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. అనంతరం పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించగా వారు బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం, వారి పరిస్థితి విషమించడంతో ఒంగోలు రిమ్స్‌ కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న కుమార్తె ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య పరిస్థితికి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.