Begin typing your search above and press return to search.

కోవిడ్ భయం.. రెండేళ్లుగా స్వీయ నిర్బంధంలో మహిళలు..!

By:  Tupaki Desk   |   21 Dec 2022 4:39 AM GMT
కోవిడ్ భయం.. రెండేళ్లుగా స్వీయ నిర్బంధంలో మహిళలు..!
X
కరోనా ప్రపంచానికి పరిచయమై మూడేళ్ళు గడిచిపోయాయి.ప్రస్తుతం నాలుగో ఏడాదిలోనూ మనమంతా కరోనాతో సహజీవనం చేస్తున్నాం. మొదటి రెండేళ్లు కరోనాతో యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. దీని ధాటికి అగ్రరాజ్యాలు సైతం కుదేలుగా భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించడం.. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

గత ఏడాది కాలంగా కరోనా అంటే ప్రజల్లో భయం పోయింది. కరోనా కేసులు నమోదు అవుతున్నప్పటికీ ప్రజలంతా త్వరగా రికవరీ అవుతున్నారు. గతంలో పోలిస్తే ప్రాణనష్టం పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే భారత్ లో మళ్లీ కరోనాకు ముందు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలంతా మాస్కుల్లేకుండానే విందులు.. వినోదాల తదితర సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

మహిళలు ఎంచక్క షాపింపులు గట్రా చేసేస్తున్నాయి. అయినప్పటికీ కొందరిలో కరోనా భయం మాత్రం పోవడం లేవడం లేదు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మహిళలు కరోనా భయంతో రెండేళ్లుగా ఇంటిలోనే స్వీయ నిర్బంధంలో ఉన్న ఘటన తాజాగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..!

కాకినాడ జిల్లా కుయ్యెరు గ్రామంలో మణి అనే మహిళ తన భర్త.. కూతురు దుర్గాభవానితో కలిసి నివసిస్తుంది. 2020లో ఏపీలో కరోనా విజృంభిస్తున్న సమయంలో మణి.. దుర్గా భవానిలు ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఆ తర్వాత కోవిడ్ పరిస్థితులు చక్కబడిన సంగతి తెల్సిందే. అయినప్పటికీ ఆ మహిళలు మాత్రం నాలుగు గోడలకే పరిమితమయ్యారు.

ఈ ఇద్దరు మహిళలకు మణి భర్త ఆహారం.. నీరు అందించేవాడు. అయితే గత వారం రోజులుగా వారిద్దరు అతడిని తమ గదిలోకి అనుమతించడం లేదు. దీంతో ఆయన స్థానిక అధికారులకు సమాచారం అందించారు. ఈక్రమంలోనే ఆరోగ్య కార్యకర్తలు మణి ఇంటికి వెళ్లి ఆ ఇద్దరు మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.అయినప్పటికీ వారు తమ గది తలుపులు తెరిచేందుకు నిరాకరించారు. చివరికీ బలవంతంగా గది తలుపులు తెరిచి వారిని కాకినాడ ప్రభుత్వ ఆసత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం వారి మానసిక స్థితి సరిగా లేదని వైద్యులు చెబుతున్నారు. కాగా గత జూలైలో సైతం ఇలాంటి ఘటన తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. కోవిడ్ తో తమ పక్కింటి వ్యక్తి చనిపోయాడని భయపడిన ఓ జంట తమ ఇద్దరు పిల్లలతో 15 నెలలుగా తమ ఇంటికే పరిమితమయ్యారు. గ్రామ వాలంటీర్ ఇళ్ల పట్టా కోసం బయోమెట్రిక్ తీసుకునేందుకు వెళ్లగా ఈ విషయం నాడు వెలుగులోకి వచ్చింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.