Begin typing your search above and press return to search.

నరరూప రాక్షసి.. ప్రేమ పెళ్లి వద్దని చెప్పిందని పెంపుడు తల్లిని చంపేసింది

By:  Tupaki Desk   |   12 Sep 2021 3:31 AM GMT
నరరూప రాక్షసి.. ప్రేమ పెళ్లి వద్దని చెప్పిందని పెంపుడు తల్లిని చంపేసింది
X
ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఆకలితో ఉన్నకుక్కకు ఒక బిస్కెట్ వేస్తే.. తన ఆకలి తీర్చిన వ్యక్తిని ఎప్పటికి మర్చిపోదు ఆ కుక్క. అలాంటిది అన్నీ తానై పెంచిన పెంపుడు తల్లిని పొట్టన పెట్టుకున్న పెంపుడు కుమార్తె వైనం షాకింగ్ గా మారింది. ప్రేమించినోడితో పెళ్లి వద్దని చెప్పిందని.. తాను అడిగినంత డబ్బులు ఇవ్వలేదన్న కారణాలతో దారుణంగా హత్య చేసిన వైనం వింటే.. అయ్యో అనుకోకుండా ఉండలేరు. హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఈ దారుణం సంచలనంగా మారింది. ప్రధాన మీడియాలో పెద్దగా ఫోకస్ కాని ఈ దారుణానికి సంబంధించిన వివరాలు తెలిస్తే.. గుండెల్ని పిండేసే బాధ కలగటం ఖాయం.

ఫ్రాన్స్ కు చెందిన 68 ఏళ్ల మేరీ క్రిస్టీనా.. పేదల్ని.. అనాధల్ని అక్కున చేర్చుకోవటం.. వారికి విద్యాబుద్ధులు నేర్పించటం కోసం మూడు దశాబ్దాలుగా మహానగరంలో పెద్ద ఎత్తున సేవ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు స్కూళ్లను నిర్వహిస్తున్న ఆమెకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు మేరీ సొలాంగ్ కాగా.. మరొకరు రెబెకా. మేరీ సన్ సిటీలో నివసిస్తుండగా.. చిన్న కుమార్తె పుదుచ్చేరిలో ఉంటున్నారు. కన్నబిడ్డలు ఇద్దరు ఒక ఇంటి వారు కావటంతో.. మేరీ ఒంటరిగా ఉండేవారు. దీంతో.. అనాథలైన 24 ఏళ్ల రోమా.. ప్రియాంకలను ఇంట్లోనే ఉంచుకొని పోషిస్తున్నారు.

ఇందులో భాగంగా రోమాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే.. రోమా మాత్రం అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విక్రమ్ శ్రీరాములు ప్రేమలో పడింది. పెంపుడు తల్లికి తెలీకుండా కొండాపూర్ లో అద్దె ఇంటిని తీసుకొని అతనితో సహజీవనం చేస్తోంది. ఈ విషయం తెలిసిన మేరీ ఆమెను మందలించింది. ఇదిలా ఉండగా.. తాను బొతిక్ పెట్టుకొని లైఫ్ లో సెటిల్ అవుతానని.. అందుకోసం రూ.2లక్షలు కావాలని కోరింది. అందుకు మేరీ నో చెప్పారు. వాస్తవానికి తాను పెంచిన రోమా కోసం ఆమె రెండు ఇళ్లను.. కొంత నగదును ఆస్తిగా ఇవ్వాలని భావించినట్లు చెబుతారు.

అయితే.. ఆమె ప్రవర్తన సరిగా లేకపోవటంతో.. ఆమె జీవితంలో స్థిరపడిన తర్వాత తాను ఇవ్వాలనుకున్న ఆస్తి ఇద్దామని అనుకున్నట్లు చెబుతారు. ఇదిలా ఉంటే.. తాను అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో పెంపుడు తల్లిని చంపాలని తన ప్రియుడు విక్రమ్.. అతని పాత ఫ్రెండ్ రాహుల్ తో కలిసి ప్లాన్ చేసింది. తాను ప్రియుడ్ని వదిలేశానని.. ఒంటరిగా హాస్టల్ లో ఉంటున్నట్లుగా అబద్ధాలు చెప్పింది. ఆమె మాటల్ని నమ్మిన మేరీ.. రోమాను ఇంటికి తీసుకెళ్లకుండా.. టోలీ చౌకిలో ఉన్న తన స్కూల్ లో ఉండాలని చెప్పి తాను ఇంటికి బయలుదేరింది.

ముందుగా అనుకున్న పథకంలో భాగంగా విక్రమ్.. రాహుల్ ఇంటివద్ద కాపు కాశారు. కారులో మేరీ ఇంటికి చేరుకోని పార్కింగ్ చేసి బయటకు రాగానే.. ఆమెపై దాడి చేసి.. మెడకు తాడుతో ఉరి వేసి చంపేశారు. ఆమె డెడ్ బాడీని తీసుకొని కారులోనే హిమాయత్ సాగర్ సమీపంలోని పొదల్లో పడేశారు. అదే కారులో ఇంటికి వచ్చి ల్యాప్ టాప్.. సెల్ ఫోన్ తీసుకొని పరారయ్యారు. తర్వాతి రోజున మేరీ బ్యాంక్ అకౌంట్ నునంచి రూ.2లక్షల్ని రోమా తన ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. తల్లి ఫోన్ స్విఛ్ ఆఫ్ ఉండటంతో అనుమానించిన కుమార్తెలు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రోమా కదలికలపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్న వారు విచారించగా.. ఆమె చేసిన దారుణం వెలుగు చూసింది. పెంచిన తల్లిని దారుణంగా హతమార్చిన రోమా వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.