Begin typing your search above and press return to search.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక ప్రాణాలు విడిచిన బాలింత

By:  Tupaki Desk   |   23 July 2020 12:30 AM GMT
ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక ప్రాణాలు విడిచిన బాలింత
X
ప్రభుత్వ ఆసుపత్రులపై ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా నిర్వహణ తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే భయపడే రోజులు వచ్చాయి. డబ్బులు ఎక్కువ అయినా కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలు అయినా దక్కుతాయని అనుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వ మాటలు చెప్తున్నా కూడా గ్రౌండ్ స్థాయిలో అది జగరడం లేదు. తాజాగా ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో చోటుచేసుకోవడం గమనార్హం.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంకి చెందిన శ్రీలత అనే బాలింత జలుబు, తలనొప్పి కారణంగా మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అప్పుడు డ్యూటీ డాక్టర్ ఆమెను పరీక్షించి ఇంటికి పంపించారు. అయితే , శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడం, దగ్గు వస్తుండటంతో కుటుంబ సభ్యులు మళ్లీ శ్రీలతను హాస్పిటల్ ‌కు తీసుకొచ్చారు. కానీ, ఆ సమయంలో ఆసుపత్రిలో డాక్టర్స్ ఎవరు లేరు. దీనితో పక్కనే 108 వాహనం ఉండటంతో ఆ బాలింతను హైదరాబాద్ తీసుకెళ్లాలని ప్రాధేయపడ్డారు. వారు అంబులెన్స్ లో డీజిల్ లేదని, ఇప్పుడు రాలేమని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ సమయంలో శ్రీలత శ్వాస తీసుకోవడానికి మరింతగా ఇబ్బంది పడింది. ఆక్సిజన్ సిలిండర్ కోసం హాస్పిటల్ సిబ్బంది వెతుకుతుండగానే ఆ బాలింత అక్కడే కన్నుమూసింది.

ఉదయం 9 గంటల నుంచి ఓపీ చూడాల్సిన డాక్టర్లు 11 గంటలైనా డ్యూటీకి రాలేదని , మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ సిబ్బంది సకాలంలో స్పందించి ఆక్సిజన్ అందించినా.. 108 సిబ్బంది స్పందించినా తమ కూతురు ప్రాణాలతో బయటపడేది అని కుటుంబ సభ్యులు, శ్రీలత భర్త ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నియోజకవర్గంలోనే ఇలా ఉంటే .. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిల పరిస్థితి ఏమిటి అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.