Begin typing your search above and press return to search.

మహమ్మారితో భర్త మృతి.. బతికే ఉన్నాడని భార్య పోరాటం

By:  Tupaki Desk   |   22 May 2020 4:15 AM GMT
మహమ్మారితో భర్త మృతి.. బతికే ఉన్నాడని భార్య పోరాటం
X
మహమ్మారి ఎంతటి విషాదగీతాన్ని కుటుంబాల్లో ఆలపిస్తుందో తెలిపే దారుణ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఓ కుటుంబ పెద్దకు మహమ్మారి సోకింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు మరణించాడు. కుటుంబ సభ్యులు మహమ్మారితో చనిపోయిన అతడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ముందుకురాలేదు. జీహెచ్ఎంసీ ఆ మృతదేహాన్ని కాల్చేసింది. ఇప్పుడు ఇన్నాళ్లకు ఓ మహిళ తన భర్త తప్పిపోయాడని ఫిర్యాదు చేసింది. కేటీఆర్ కు ట్వీట్ చేసి తన భర్తను గుర్తించాలని కోరింది. మహమ్మారితో అతడు చనిపోయాడని గాంధీ ఆస్పత్రి చెబుతున్నా ఆ మహిళ ఫ్రూవ్స్ కావాలంటోంది. ఇంతటి విషాదం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నివసిస్తున్న అలంపాల్ మాధవి తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహమ్మారితో చికిత్స పొందుతున్న తన భర్త గాంధీ ఆస్పత్రి నుంచి తప్పిపోయాడని కేటీఆర్ కు ఆమె ఫిర్యాదు చేసింది.

మహమ్మారి పాజిటివ్ రావడంతో ఏప్రిల్ 30న మధుసూదన్ (42)ను గాంధీ ఆస్పత్రి లో చేర్పించారని.. వ్యాధి ముదిరి న్యూమోనియాకు దారితీసి పరిస్థితి విషమించి అతడు మే 1న చనిపోయాడని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎం రాజారావు గురువారం తెలిపారు. ఆస్పత్రిలో చేరిన ఒకరోజు తర్వాత ఆమె భర్త మరణించాడని గాంధీ ఆస్పత్రి తెలిపింది. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రానందున జీహెచ్ఎంసీకి అప్పగించామని.. వారు దహన సంస్కారాలు చేసినట్టు తెలిపారు. గాంధీ వైద్యులపై ఆస్పత్రిపై అభాండాలు వేయవద్దని కోరారు.

మధుసూదన్ కు మహమ్మారి పాజిటివ్ వచ్చాక అతడి భార్య, ఇద్దరు కుమార్తెలను కూడా ఆస్పత్రికి తరలించి పరీక్షించగా పాజిటివ్ వచ్చింది. దీంతో వారికి చికిత్స అందించి మే 16న డిశ్చార్జ్ చేశారు. ఆమె భర్త అప్పటికే మరణించడంతో ఆయన మృతదేహాన్ని వీరు తీసుకెళ్లలేకపోయారు. దహన సంస్కారాలకు అవకాశం లేకుండా పోయింది.

అయితే బయటకొచ్చిన మాధవి తాజాగా తన భర్త అంత్యక్రియలు చేసినట్టు ఫొటోలు, వీడియోలు ఉంటే రుజువులు చూపించాలని పట్టుబడుతోంది. నా భర్త మరణించలేదని.. తప్పిపోయాడని అంటోంది. తమకు అధికారులు కనీసం సమాచారం ఇవ్వలేదని..కర్మలు కూడా చేయకుండా ఎలా కాల్చేశారని ప్రశ్నిస్తోంది. ఆధారాలు చూపిస్తే తాము తమ భర్త చనిపోయాడని నమ్ముతామని మృతుడి భార్య మాధవి డిమాండ్ చేస్తోంది.

ఇలా మహమ్మారి చావులు ఎంత దుర్లభంగా దారుణమైన పరిణామాలకు దారితీస్తాయో చూపే సంఘటన తాజాగా హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అమెరికా, ఇటలీలో కూడా ఇలానే వందలాది మహమ్మారి శవాలను గుట్టులుగా పూడ్చిపెట్టిన వైనం చూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం విషాదం నింపింది.