Begin typing your search above and press return to search.

చైనా...ఆ ద‌శ‌ను దాటేసింది

By:  Tupaki Desk   |   8 Aug 2017 5:52 AM GMT
చైనా...ఆ ద‌శ‌ను దాటేసింది
X
పొరుగు దేశ‌మైన చైనా మ‌నతో సంబంధాల విష‌యంలో స‌ఖ్య‌త కంటే స‌మ‌స్య‌లు సృష్టించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇన్నాళ్లు ప‌రోక్షంగా త‌న అభిప్రాయాలు చెప్పిన చైనా ఏకంగా ప్ర‌త్య‌క్షంగా త‌న తెగింపును చాటుతోంది. స‌రిహ‌ద్దులోని డోక్లాం వివాదాన్ని తాజాగా చైనా మరింత రగిలించింది. నేరుగానే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ ఏ) ఈ వివాదంపై స్పందించింది. గత కొన్ని వారాలుగా తమ భూభాగంలో మోహరించిన భారత దళాలు తక్షణమే తప్పుకోకపోతే సంఘర్షణ తప్పదంటూ పీఎల్‌ ఏకు చెందిన సీనియర్ కల్నల్ లీలీ హెచ్చరించారు.

స‌రిహ‌ద్దు వివాదాన్ని అధ్యయనం చేసేందుకు వచ్చిన భారత పాత్రికేయులతో మాట్లాడిన ఆయన ‘ భారత సైనికులు తీసుకున్న చర్య చైనా భూభాగాన్ని ఆక్రమించుకోవడమే’ అని స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనా సైనికులు ఏమనుకుంటున్నారో మీరు రాసుకోండి అని కూడా కల్నల్ లీ స్పష్టం చేశారు. తాను చైనా సైనికుడినని, త‌మ దేశ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన తెలిపారు. అందుకు అవసరమైన నిబద్ధత, అంకితభావం పీఎల్‌ఏకు చెందిన సైనికులు అందిరిలోనూ ఉందని కూడా తేల్చి చెప్పారు. అంతేకాదు, భారత మీడియా ముందే చైనా దళాలు తమ యుద్ధపాటవాన్నీ ప్రదర్శించాయి. అన్ని రకాల ఆయుధాలనూ అత్యంత నైపుణ్యంగా ఉపయోగిస్తూ ప్రత్యర్థి శక్తులను తాము ఏవిధంగా ఎదుర్కోగలమో కళ్లకుకట్టాయి. అయితే, తాము ఈ ప్రదర్శన జరిపింది డోక్లాం విషయంలో ఏం చేయబోతున్నామో తెలియజేయడానికి కాదని వివరించిన కల్నల్ లీ స్పష్టం చేశారు.

మ‌రోవైపు డోక్లాం విషయంలో భారత్‌ ను దారికి తెచ్చుకునేందుకు చైనా మూడంచెల విధానాన్ని అనుసరించే అవకాశం ఉందంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో ఇటు భారత్‌గాని, అటు చైనాగాని యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేసిన నిపుణులు డ్రాగన్ మాత్రం త్రిముఖ వ్యూహంతోనే ముందుకువెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా వ్యూహాత్మక రీతిలో మానసిక ఒత్తిడిని పెంచే కార్యకలాపాలు చేపట్టడం, మీడియాలో వక్రీకృత కథనాలను ప్రచారం చేయడం, న్యాయపరంగా తమకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని ఇతర దేశాలను తప్పుదోవ పట్టించడమే చైనా వ్యూహమని అంటున్నారు. వ్యూహాత్మక మానసిక యుద్ధతంత్రంలో భాగంగా చైనా నియంత్రణలోని మీడియా పిఎల్‌ఏ యుద్ధ విన్యాసాలకు సంబంధించి వీడియో - ఆడియో - చిత్రాలను విడుదల చేసిందని, దాని వెనుకవున్న ఉద్దేశం భారత సైన్యంలో దడ పుట్టించడమే కాకుండా ఏంజరగబోతోందన్న ఆందోళన పౌరుల్లో కల్పించడమేనని చెప్పారు. 1962నాటి యుద్ధాన్ని గుర్తు చేయడం ఈ మానసిక యుద్ధ తంత్రంలో భాగమేనని పేర్కొన్నారు. ఇక రెండోది అంతర్జాతీయంగా తప్పుడు కథనాలతో తనకు అనుకూలమైన వాదనను బలపర్చుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని, తమ తప్పుడు వైఖరినే సమర్థించుకుంటూ మీడియాలో ప్రచార హోరు మొదలుపెట్టిందని తెలిపారు. ఇక అంతిమంగా ప్రత్యర్థి దేశ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ప్రవేశించడం, బెదిరింపులకు పాల్పడి దురాక్రమణ చేయడమేనని స్పష్టం చేశారు.