Begin typing your search above and press return to search.

ఇవాళైనా గెలుస్తారా? టీ20పై సర్వత్రా ఆసక్తి..!

By:  Tupaki Desk   |   14 March 2021 8:31 AM GMT
ఇవాళైనా గెలుస్తారా? టీ20పై సర్వత్రా ఆసక్తి..!
X
ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలి టీ20లో కొత్త వ్యూహంతో కోహ్లీ సేన బరిలో దిగి దెబ్బతిన్నది. దీంతో రెండో సారి పక్కా కసరత్తులతో ముందుకుసాగుతున్నది. అయితే తొలి టీ20 లో రోహిత్​ శర్మను అనూహ్యంగా పక్కన పెట్టారు. మరోవైపు టాప్​ ఆర్డర్​ కుప్పకూలింది. శ్రేయస్​ అయ్యర్​ మినహా.. ఏ ఆటగాడు రాణించలేదు. దీంతో రెండో టీ20లో ఎలాగైనా గెలవాలని టీమిండియా వ్యూహాలు రచించింది.

రెండో టీ20లో టీమిండియా కొత్త లెక్కలతో ముందుకెళ్తున్నది. ఇంగ్లాండ్​ జట్టు కూడా ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ముందుకు సాగుతున్నది. తొలి టీ20లో రోహిత్​ శర్మను అనూహ్యంగా పక్కకు పెట్టడంతో విమర్శలు వచ్చాయి. రోహిత్​కు ఎందుకు పక్కకు పెట్టారంటే సెహ్వాగ్​ లాంటి మాజీ క్రికెటర్లు ప్రశ్నించారు. అయితే రెండో టీ20లోనైనా రోహిత్​ను ఆడిస్తారా? లేదో? వేచి చూడాలి.

గత మ్యాచ్​లో ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దింపి బోల్తాపడ్డ టీమిండియా ఈ సారి కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నది.

అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్‌లలో ఒకరిని తప్పించి ఫాస్ట్‌ బౌలర్‌ నవదీప్‌ సైనీకి అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఈ సారి మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి కీలకం కానున్నాడు. టీమ్‌లో ఇద్దరు దూకుడైన ఆటగాళ్లు రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా చెలరేగి ఆడితే మాత్రం టీమిండియాకు తిరుగుండదు.
పునరాగమనంలో భువనేశ్వర్‌ కుమార్‌ బాగానే బౌలింగ్‌ చేయగా, శార్దుల్‌ ఠాకూర్‌ ఫర్వాలేదనిపించాడు. కొత్త ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్‌లకు ఈ మ్యాచ్‌లోనూ అవకాశం దక్కకపోవచ్చు.

ఇంగ్లాండ్​ జట్టు వ్యూహం ఏమిటి?

తొలి మ్యాచ్ ను ఇంగ్లండ్​ సునాయాసంగా గెలవగలిగింది. దీంతో రెండో మ్యాచ్​లోనూ ఎలాగైనా గెలుపొందాలని వ్యూహాలు రచిస్తున్నది. ఇంగ్లాండ్​ జట్టులో అంతా ఆల్​రౌండర్సే ఉన్నారు. ఒక్క ఆదిల్‌ రషీద్‌ మినహా పదో నంబర్‌ వరకు బ్యాటింగ్‌ చేయగలరు. ఈ మ్యాచ్‌లోనూ దాదాపు అదే టీమ్‌కు అవకాశం ఉంది.

అయితే పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా కనిపిస్తే స్యామ్‌ కరన్‌కు బదులుగా ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీకి అవకాశం ఇవ్వాలని ఇంగ్లండ్‌ యోచిస్తోంది. ప్రధాన స్పిన్నర్‌ రషీద్‌ కూడా గత మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు. ధాటిగా ఆడగల ఓపెనర్లు జేసన్‌ రాయ్, జోస్‌ బట్లర్‌ ఆ జట్టుకు పెద్ద బలం. జోఫ్రా ఆర్చర్, మార్క్‌ వుడ్‌ గత మ్యాచ్​లో బౌలింగ్​లో అద్భుత ప్రదర్శన ఇచ్చారు. వీళ్లు మరోసారి విజృంభిస్తే భారత్​కు కష్టమే.

తుది జట్టు వివరాలు (అంచనా)

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్‌/రోహిత్‌ శర్మ, రాహుల్, పంత్, అయ్యర్, పాండ్యా, శార్దుల్, సుందర్‌/సైనీ, అక్షర్, భువనేశ్వర్, చహల్‌.

ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, కరన్‌/అలీ, ఆర్చర్, జోర్డాన్, రషీద్, వుడ్‌.

పిచ్, వాతావరణం

మొటెరాలో 11 పిచ్‌లు అందుబాటులో ఉన్నాయి. గత మ్యాచ్‌ అనుభవాన్ని బట్టి చూస్తే పేస్, బౌన్స్‌ కాస్త తక్కువగా ఉండి స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బ్యాట్స్‌మెన్‌ నిలబడితే పరుగులు రావడం కష్టం కాదు. వర్ష సూచన లేదు.