Begin typing your search above and press return to search.

యనమలతోనే ఆ సందేశాన్ని పంపిస్తారా...?

By:  Tupaki Desk   |   10 Oct 2022 3:30 PM GMT
యనమలతోనే ఆ సందేశాన్ని పంపిస్తారా...?
X
టీడీపీలో సీనియర్ మోస్ట్ నాయకుడు యనమల రామక్రిష్ణుడు. ఒక ప్రాంతీయ పార్టీలో పలు కీకల శాఖలను చూడడమే కాదు, జాతీయ పార్టీకి చెందిన కె రోశయ్య తో పోటీ పడుతూ ఆర్ధిక మంత్రిగా పనిచేసిన నేత ఆయన. స్పీకర్ గా అయిదేళ్ళ పాటు ఆయన ఉమ్మడి ఏపీలో పనిచేశారు. ఆ సమయంలో టీడీపీలో అతి పెద్ద చీలిక వస్తే ఎన్టీయార్ ని కాదని చంద్రబాబు వైపు మొగ్గు చూపారన్న నిందని ఈ రోజుకీ మోస్తున్నారు.

ఇదిలా ఉంటే వెనకబడిన వర్గానికి చెందిన యనమల మేధావిగా కూడా టీడీపీలో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆయన ధీటైన నేతగా ఎదిగారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009 ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఓటమిని చవిచూశారు. ఆ తరువాత నుంచి ఆయన శాసనమండలిలోనే ఎమ్మెల్సీగా ఉంటున్నారు. విభజన తరువాత కూడా అయిదేళ్ల పాటు చంద్రబాబు సర్కార్ లో ఆర్ధిక మంత్రిగా యనమల ఉన్నారు.

ఇక యనమల సేవలకు గుర్తుగా రెండవసారి కూడా ఆయనకు ఎమ్మెల్సీ ని కంటిన్యూ చేసారు. అలా ఆ పదవీకాలం 2025 దాకా ఉంది. ఇదిలా ఉంటే యనమల తన రాజకీయ వారసత్వాన్ని కుమార్తె ద్వారా చూడాలని అనుకుంటున్నారు. తన కుమార్తెకు తుని టికెట్ ఇవ్వమని ఆయన అధినాయకత్వాన్ని కోరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తునిలో ఇప్పటికే రెండు ఎన్నికల్లో యనమల తమ్ముడు క్రిష్ణుడికి టికెట్ ఇస్తే ఆయన ఓటమి పాలు అయ్యారు.

అయితే 2024 నాటికి తన కుమార్తెకి టికెట్ ఇస్తే గెలిపించుకుని వస్తానని ఆయన అధినాయక్త్వానికి చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికలు చాలా కీలకం. దాంతో ఆ పార్టీ కొన్ని కఠిన నిబంధనలను పెట్టుకుంది. రెండుసార్లు ఓడిన వారికి టికెట్లు ఇవ్వకూడని, అలాగే ఒకే కుటుంబంలో అనేక అవకాశాలు ఇవ్వకూడదని.

ఈ విధంగా ఉన్న నిబంధన చూసుకుంటే అది యనమల కోసమే పెట్టిందా అని అనిపించకమానదు. ఎందుకంటే యనమల తమ్ముడు రెండుసార్లు ఎన్నికల్లో ఓడారు. సో ఆ విధంగా చూసుకుంటే తుని టికెట్ యనమల ఫ్యామిలీకి రాదు, మరో వైపు చూస్తే యనమల ఎమ్మెల్సీగా ఉన్నారు. అదే ఫ్యామిలీ నుంచి మరొకరికి టికెట్ ఇవ్వడం కుదరదు. సో యనమలకు ఏ నిబంధన చూసుకున్నా టికెట్ లేదు రాదు అనే చెప్పాలి.

కానీ ముందే చెప్పుకున్నట్లుగా యనమల సీనియర్. పైగా చంద్రబాబుకు ఆప్తుడు. బాబుకు మొహమాటం కొద్దీ యనమల కుమార్తెకు టికెట్ ఇస్తారా అన్న చర్చ అయితే ఉంది. కానీ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా సీనియర్ నేత యనమల నుంచే ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తే మొత్తం పార్టీ జనాలకు గట్టి సందేశం ఇచ్చినట్లుగా ఉంటుంది అని అంటున్నారు. మరి అది సాధ్యమేనా. అలా సాధ్యం చేస్తేనే తునితో సహా చాలా సీట్లలో తెలుగు వెలుగులు పండుతాయని అంటున్నారుట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.