Begin typing your search above and press return to search.

గులాబీ బాస్ కు మోడీ అపాయింట్ మెంట్ ఇస్తారా?

By:  Tupaki Desk   |   2 Sep 2021 5:30 AM GMT
గులాబీ బాస్ కు మోడీ అపాయింట్ మెంట్ ఇస్తారా?
X
మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు దేశ రాజధాని వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఢిల్లీలో అడుగు పెట్టారో లేదో.. ఆయనకుసంబంధించిన ఒక ప్రెస్ రిలీజ్ బయటకు రావటం.. అది కాస్తా ఆసక్తికరంగా మారింది. దాని సారాంశం ఏమంటే.. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నించటం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు అపాయింట్ మెంట్ ఇస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ టైం కోసం వారి కార్యాలయాల్లో గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వారు టైమిస్తే.. వెళ్లి వారిని కలవాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు. గత ఏడాది డిసెంబరు రెండో వారంలో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. మళ్లీ దేశ రాజధానికి వెళ్లటం ఇదే తొలిసారి.ఆ సందర్భంలోనే ప్రధాని మోడీ.. హోంమంత్రి అమిత్ షాలతో ఆయన భేటీ అయ్యారు.

గులాబీ బాస్ కోరినంతనే మోడీషాలు అపాయింట్ మెంట్ ఇస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఒక పక్క తమ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న వేళ.. ఢిల్లీలో తెలంగాణ సీఎంకు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇస్తే ఏం బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. ఓపక్క కేసీఆర్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేయటమే కాదు.. ఆయన అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేయటం తెలిసిందే. ఇలాంటి వేళ..కేసీఆర్ కు ప్రధాని మోడీ టైమిస్తే.. బీజేపీ నేతల్లో స్థైర్యం దెబ్బ తింటుందన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే సతీసమేతంగా శ్రీశైలం పర్యటనకు వచ్చిన అమిత్ షా.. హైదరాబాద్ లో ఆగారు. కేంద్రంలో నెంబరు టూ స్థానంలో ఉండటమే కాదు.. మోడీ సర్కారుకు కళ్లు..చెవులుగా వ్యవహరిస్తారని చెప్పే అమిత్ షాను కలిసేందుకు ప్రభుత్వంతరఫున ఎవరూ రాకపోవటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం మీదుగా శ్రీశైలానికి వెళ్లిన సందర్భంలో హైదరాబాద్ లో తనకు ఎదురైన అనుభవం నేపథ్యంలో.. కేసీఆర్ కు షా టైమిస్తారా? అన్నది ఒక ప్రశ్నగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ కానీ తనకు టైమిస్తే.. ఆయనతో మాట్లాడేందుకు పలు అంశాలపై చర్చ జరిపేందుకు కేసీఆర్ ఎజెండా సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో తాను షురూ చేసిన దళిత బంధు.. దాని అమలు చేస్తున్న తీరు.. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న పురస్కారం.. పార్లమెంటులో ఆయన చిత్రపటం.. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు తదితర అంశాల్ని ప్రస్తావిస్తారని చెబుతున్నారు.

అంతేకాదు.. ఔషధనగరి శంకుస్థాపనకు రావాల్సిందిగా ప్రధాని మోడీని ఆహ్వానించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అన్నింటికి మించి క్రిష్ణా.. గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం జారీ చేసిన గెజిట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ వాటాల గురించి వివరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా కేసీఆర్ కు ప్రధాని మోడీ టైమిస్తే.. మరి.. ఇస్తారా? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.