Begin typing your search above and press return to search.

కుమారస్వామి ముందే రాజీనామా చేస్తారా?

By:  Tupaki Desk   |   16 July 2019 7:02 AM GMT
కుమారస్వామి ముందే రాజీనామా చేస్తారా?
X
కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం.. అసమ్మతి ఎమ్మెల్యేలకు కేంద్రంగా మారింది. ఉత్తర కర్ణాటకలోని బెళగావి జిల్లాలో గోకాక్‌ ఎమ్మెల్యే రమేశ్‌ జార్కిహోళితో అసంతృప్తవాదం ప్రారంభమైనప్పటికీ బెంగళూరు నేతలు తిరుగుబాటు చేసిన తర్వాత తారస్థాయికి చేరింది. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నుంచి రాజీనామా చేసిన అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది బెంగళూరుకు చెందిన వారు ఉన్నారు. నగరంలోని 28 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 15, జేడీఎస్‌ 2, బీజేపీ 11 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు అసంతృప్తిగా ఉన్నారు.

ఉత్తర కర్ణాటకలోని బెళగావి జిల్లా రాజకీయాల్లో మంత్రి డీకే శివకుమార్‌ జోక్యం చేసుకోవడంతో అసంతృప్తి జ్వాలలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా బెళగావి కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి బీజేపీలో వెళ్లేందుకు యత్నించారు. అక్కడి నుంచి ప్రారంభమైన అసంతృప్తవాదం బెంగళూరు నగరంలోని ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా ప్రమాదంలో పడిందని చెప్పవచ్చు.

సీఎం కుమారస్వామి సోదరుడు మంత్రి అయిన హెచ్‌ డీ రేవణ్ణ బెంగళూరులోని అన్ని నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగింది. సూపర్‌ సీఎంగా పేరుమోసిన రేవణ్ణ.. తన పరిధి దాటిపోయి అన్ని శాఖల్లో తనదైన శైలిలో దూసుకుపోయారనే ఫిర్యాదులు ఉన్నాయి. సీఎం కుమారస్వామికి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదు. మరోవైపు డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ ఏం చేయలేని పరిస్థితి. ఈక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా సీఎం కుమారస్వామికి రేవణ్ణ గురించి ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. దీంతో సిద్ధరామయ్య నేతృత్వంలోనే అసమ్మతి వాదులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినట్లు ప్రచారం సాగుతోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని మనుగడ సాగించాలంటే.. మాజీమంత్రి, బీటీఎం లేఅవుట్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి నిర్ణయం కూడా కీలకం అనిపిస్తోంది. ఈక్రమంలో కాంగ్రెస్‌ పెద్దలు మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ రామలింగారెడ్డి నివాసానికి వెళ్లి చర్చించారు. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే తనకు కేబినెట్‌ బెర్తు ఖరారు చేయాలని రామలింగారెడ్డి షరతు విధించినట్లు తెలిసింది.

ఓవైపు రేవణ్ణను నియంత్రించలేక.. మరోవైపు కాంగ్రెస్‌ నేతలను బుజ్జగించలేక సీఎం కుమారస్వామి ఇరుక్కుపోయారు. రాజీనామా చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. కాగా సిద్ధరామయ్యకు సీఎం పదవి కట్టబెడితే.. అసమ్మతిలోని కాంగ్రెస్‌ సభ్యులు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కానీ జేడీఎస్‌ పెద్దలు ఒప్పుకునే స్థితిలో లేనట్లు తెలుస్తోంది. అయితే ఉన్నఫలంగా సీఎం కుమారస్వామి అవిశ్వాస తీర్మానానికి సవాల్‌ విసిరారు. కానీ ఎమ్మెల్యేలు ఎవరూ అందుబాటులోకి రాకపోవడంతో అయోమయంలో పడ్డారు. తాను బుజ్జగించిన మంత్రి ఎంటీబీ నాగరాజు ముంబయి తరలివెళ్లడంతో సీఎం కుమారస్వామి ధైర్యం కోల్పోయారు.