Begin typing your search above and press return to search.

మా అశలు తీరుస్తావా జగన్ బాబూ... ?

By:  Tupaki Desk   |   16 Nov 2021 3:30 PM GMT
మా అశలు తీరుస్తావా జగన్ బాబూ... ?
X
ఉత్తరాంధ్రా అన్నది అత్యంత వెనకబడిన ప్రాంతం. ఈ మాట ఎవరో చెప్పినది కాదు, అప్పట్లో కేంద్రం నియమించిన శ్రీక్రిష్ణ కమిషన్, శివరామ క్రిష్ణ కమిషన్ వంటివి తన నివేదికల్లో భద్రంగా పొందుపరచాయి. మూడు జిల్లాలకు సాగు తాగు నీరు కష్టాలే కాదు, ఉద్యోగ ఉపాధి లేక కటకటలాడుతున్నాయి. పారిశ్రామికంగా అత్యంత వెనకబాటుతనం ఉంది. విశాఖ సిటీని మినహాయిస్తే విశాఖ రూరల్ జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం తలసరి ఆదాయం కూడా దారుణంగా ఉంటుంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పూర్తిగా వలస జిల్లాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ జిల్లాల్లోని జనాలు చెన్నై, ముంబై ఆఖరుకు దుబాయి దాకా కూడా బతుకు తెరువు కోసం పరుగులు తీస్తారు.

ఉమ్మడి ఏపీలో ఈ జిల్లాలు ఎటూ అభివృద్ధికి నోచుకోకుండా పోయాయి. దూరంగా విసిరేసినట్లుగా ఉన్న ఈ జిల్లాల గురించి పాలకులు నాడు పట్టించుకోలేదు. పైగా రాజధాని నగరం ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న ప్రాంతానికి బహు దూరం. దాంతో ఇటు వైపు ఎవరూ కన్నెత్తి చూసే సీన్ అయితే లేదు. విభజన ఏపీలో అయినా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంతా ఎదురుచూశారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఫస్ట్ మంత్రివర్గ సమావేశాన్ని విశాఖలోని ఏయూలో నిర్వహించారు. దాంతో విశాఖ రాజధాని అవుతుంది అన్న ఆశలు ఆనాడే మొదలయ్యాయి. ఆ తరువాత విశాఖ వేదికగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ సదస్సులను చంద్రబాబు తన పాలనలో నిర్వహించారు. అయితే విశాఖ సహా ఉత్తరాంధ్రాకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని నాడు చెప్పినా ఫలితం లేకుండా పోయింది.

ఇక వెనకబడిన జిల్లాలకు విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏటా యాభై కోట్ల నిధులు రావాలి. అలాగే బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజ్ కూడా ఈ జిల్లాలలో అమలు చేస్తామని చెప్పారు. కానీ ఏవీ జరగలేదు. దాంతో విసిగిన జనాలు వైసీపీకి పట్టం కట్టారు. వైసీపీ పాలనలో వెనకబడిన ప్రాంతాలకు ముక్తీ మోక్షం కలుగుతాయని ఆశించారు. అ వైసీపీ విశాఖను రాజధాని చేస్తామని ప్రకటించింది. దాంతో మూదు జిల్లాలకు మహర్దశ కలుగుతుందని ఆశించారు. వలసలకు అడ్డుకట్ట పడుతుందని కూడా సంబరపడ్డారు. అయితే రెండున్నర ఏళ్ళు జరిగినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

ఇక మూడు జిల్లాలలో ఉన్న సుగర్ ఫ్యాక్టరీలను జగన్ ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని కూడా ఆశించారు. అలాగే ఉత్తరాంధ్రా సుజల స్రవంతి పధకాన్ని 2009లో వైఎస్సార్ ప్రారంభించారు. ఆ పధకం జగన్ ఏలుబడిలో పూర్తి అవుతుంది అనుకున్నారు. దాని ఊసే లేకుండా పోయింది. ఇక శ్రీకాకుళాన్ని పారిశ్రామికవాడగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భావనపాడు పోర్టుని నిర్మిస్తామని అన్నారు. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. వీటికి మించి ఇపుడు చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం చూస్తూంటే ఏపీ సర్కార్ నుంచి పెద్దగా వత్తిడి లేదని అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రత్యక్షంగా యాభై వేల మంది పరోక్షంగా మూడు జిల్లాల నుంచి అయిదు లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. మళ్లీ ఇలాంటి ప్లాంట్ ప్రభుత్వ రంగంలో వస్తుంది అనుకుంటే పొరపాటే. బంగారు బాతుగుడ్డు లాంటి ప్లాంట్ ని రక్షించుకునే విషయంలో కూడా వైసీపీ శ్రద్ధ చూపించడం లేదని అంటున్నారు. ఇక సాగునీటి పధకాలకు ఒక్క పైసా కేటాయించలేదన్న మాట విపక్షాల నుంచి ఉంది. మధ్య తరహా, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులకు గత రెండు బడ్జెట్లలోనూ వైసీపీ సర్కార్ కేటాయించింది శూన్యమని కూడా విమర్శలు ఉన్నాయి.

ఈ మూడు జిల్లాలు వైసీపీని నమ్మి నూటికి ఎనభై సీట్లు ఇచ్చాయి. కానీ సగం పాలన పూర్తి అయినా అభివృద్ధి అన్నది లేకుండా పోయింది అన్న వ్యధ అయితే ఉంది. అలాగే, విశాఖను ఐటీ హబ్ గా టూరిజం క్యాపిటల్ గా చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని కూడా జనాలు ప్రశ్నిస్తున్నారు అంటే వైసీపీ ఏలికలు ఆలోచించుకోవాల్సిందే. ఏది ఏమైనా ఉత్తరాంధ్రా తమ గోడును చెప్పుకుంటోంది. జగన్ బాబూ మా రాతలు ఎపుడు మారుస్తావు అని గట్టిగానే అడుగుతోంది.