Begin typing your search above and press return to search.

భార్య అనుమానం.. కన్నబిడ్డలను సైతం అమానుషంగా!

By:  Tupaki Desk   |   3 Nov 2021 3:30 AM GMT
భార్య అనుమానం.. కన్నబిడ్డలను సైతం అమానుషంగా!
X
అనుమానం ఓ పాత రోగం. ఒకసారి అనుమానం అనే ఆలోచన వస్తే ఇక పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకున్నట్లే. అప్పటిదాకా సుఖసంతోషాలతో ఉన్న సంసారమైనా కూడా అనుమానం అనే దెయ్యంతో ఒక్కసారిగా బుగ్గిపాలవుతుంది. ఇక ఈ కుటుంబంలో చెలరేగిన అనుమానపు బూతం అందరినీ పొట్టనబెట్టుకుంది. భార్య అనుమానాన్ని భరించలేక ఓ భర్త... భార్యాబిడ్డలను హతమార్చాడు. చివరకు తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది. ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ కు చెందిన భాస్కర్, సుప్రీత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పండంటి బిడ్డలు ఉన్నారు. ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్లు కూతురు కలరు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా గుడుపుతున్న ఈ ఫ్యామిలీలోకి అనుమానం అనే భూతం ప్రవేశించింది. అంతే ఒక్కసారిగా ఆ కుటుంబం నాశనమైంది.

భాస్కర్ తన స్నేహితుడితో కలిసి ఇటీవలె ఏదో పని మీద బయటకు వెళ్లాడు. కట్ చేస్తే ఆ మిత్రుడు కారులోనే శవమై ఉన్నాడు. స్నేహితుడి మృతిపై కేసు నమోదు చేసిన ఛత్తీస్ గఢ్ పోలీసులు... భాస్కర్ ను పలుసార్లు విచారించారు. భాస్కర్ తో బయటకు వెళ్లడం వల్లనేమో గానీ పలుమార్లు పోలీసులు భాస్కర్ ఇంటికి వస్తుండేవారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో సుప్రీతకు భాస్కర్ పై అనుమానం వచ్చింది. ఆ హత్యను తన భర్తే చేశాడని అనుమానించింది. పైగా అతడిని వేధించడం మొదలుపెట్టింది. భర్త ఫ్యామిలీ అంతా కూడా హత్యలు చేసేవారేనని సుప్రీత తరుచూ అనేదని స్థానికులు తెలిపారు. అయితే భాస్కర్ అన్న తన భార్యను హత్య చేసి జైలులో ఉన్న ఘటనను ఎత్తిచూపుతూ... రోజూ వేధించేదని వెల్లడించారు.


భార్య వేధింపులు ఎక్కువ కావడంతో భాస్కర్ భార్యను హత్య చేశాడు. సుత్తితో ఆమె తల పగులగొట్టి హతమార్చాడు. తను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ లేకపోతే పిల్లలు అనాథలవుతారని భావించాడేమో. పిల్లలను సైతం అతి కిరాతకంగా హతమార్చాడు. భార్యాపిల్లలను చంపేసి... తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరో అంతస్తు పైనుంచి దూకి ఉసురు తీసుకున్నాడు. భాస్కర్ దూకడాన్ని గమనించిన వాచ్ మెచ్ కేకలు వేశారు. ఆలోపే భాస్కర్ దూకేశాడు. అంతలోపే స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా అతి దారుణమైన దృశ్యాలు కనిపించాయి. ఇంట్లో రక్తపు మడుగులో భార్యాపిల్లలు, బయట రక్తపు మడుగులో ఆ భర్త విగత జీవులై పడి ఉన్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వాచ్ మెన్ సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు వచ్చేలోపు భార్య కొనఊపిరితోనే ఉంది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆమె మృతి చెందింది. ఇకపోతే మృతుల ఇంట్లో భాస్కర్ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో భార్య వేధింపులు తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భాస్కర్ రాశాడని పోలీసులు తెలిపారు. తామిద్దరం చనిపోతే పిల్లలు అనాథలవుతారనే ఉద్దేశంతోనే చంపేసినట్లు అందులో పేర్కొన్నాడని వెల్లడించారు. అనుమానం అనే పెనుభూతం ప్రవేశించడం వల్లే... ఆనందంగా గడపాల్సిన వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగిసింది.