Begin typing your search above and press return to search.

రాజధానికి 90 అడుగుల రోడ్లు

By:  Tupaki Desk   |   21 July 2015 4:00 PM GMT
రాజధానికి 90 అడుగుల రోడ్లు
X
నవ్యాంధ్ర రాజధానికి దారితీసే అన్ని మార్గాలనూ 90 అడుగుల రోడ్లుగా మార్చాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే సర్వే కూడా జరుగుతోంది.

ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న జనాభాకు.. అక్కడి రోడ్లకు పొంతన కుదురుతోంది. కానీ ఇప్పుడిప్పుడే ఇక్కడ జనాభా.. రవాణా పెరుగుతున్నాయి. దాంతో ట్రాఫిక్ జామ్ లు, ప్రమాదాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ మరింత పెరుగుతుంది. జనాభాతోపాటు వాహనాలు కూడా పెరుగుతాయి. అప్పుడు కూడా ఇప్పట్లాగే రహదారులు ఉంటే విజయవాడ నుంచి అమరావతికి లేదా గుంటూరుకు వెళ్లడానికి మూడు నాలుగు గంటలు పట్టినా ఆశ్చర్యం లేదు. ఇందుకు కారణం ఈ రహదారిలో కొన్నిచోట్ల 20-30 అడుగుల రోడ్లు కూడా ఉండడమే. ఈ నేపథ్యంలోనే అమరావతికి దారితీసే అన్ని మార్గాలనూ 90 అడుగుల రోడ్లుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బాధ్యతను సీఆర్ డీఏకు అప్పగించింది.

ఇటీవలి కాలంలో విజయవాడ, మంగళగిరి నుంచి పాత మద్రాసు హైవే మీదుగా రాకపోకలు సాగించే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటికే ఆక్రమణలు, అస్తవ్యవస్త రహదారులు, ట్రాఫిక్ కారణంగా ఇప్పటికే ఇబ్బందులు వస్తున్నాయి. దాంతో, దీనిని 90 అడుగుల మేర విస్తరించాలని సీఆర్ డీఏ నిర్ణయించింది. దీనితోపాటు ఉండవల్లి సెంటర్ నుంచి తుళ్లూరు మీదుగా అమరావతికి వెళ్లే ప్రధాన రహదారిని కూడా విస్తరించాలని సర్కారు భావిస్తోంది. అలాగే, ఉండవల్లి సెంటర్ నుంచి కృష్ణా నది కరకట్టపై లింగమనేని అతిథి గృహం వరకు విశాలమైన రహదారిని నిర్మించాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి సెంటర్ కీలకంగా మారనుంది.