Begin typing your search above and press return to search.

టీడీపీ లో ఆ సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయ్యారో..?

By:  Tupaki Desk   |   11 Nov 2019 5:30 PM GMT
టీడీపీ లో ఆ సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయ్యారో..?
X
గత ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ కమ్మ సామాజికవర్గం నేతలు ఓ రేంజ్‌లో హడావిడి చేసిన విషయం తెలిసిందే. ఏ నియోజకవర్గమైనా వారి ఆధిపత్యమే నడిచింది. వారి హడావిడి, డామినేషన్ వల్ల ఎన్నికల్లో ఇతర కులాలు వారు పార్టీకి దూరమయ్యారు. టీడీపీ ఘోరంగా ఓడిపోయి 23 సీట్లకి పరిమితమైంది. ఇక ఓడిపోయాక కమ్మ సామాజికవర్గ నేతల హడావిడి తగ్గిపోయింది. ఎక్కడ వైసీపీ కేసుల్లో ఇరికిస్తుందనే భయంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వెళ్ళిపోయారు. సరే ఓడిపోయిన నేతలని పక్కనబడితే గెలిచిన కమ్మ ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

గత ఎన్నికల్లో టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 11 మంది కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ11 మందిలో ఒకరు ఇద్దరు తప్ప ఎవరు కంటికి కనబడటం లేదు. కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబు పార్టీ అధినేత కాబట్టి..ఆయనకు పార్టీని యాక్టివ్ చేయాలసిన అవసరం ఉంది కాబట్టి ఓడిన దగ్గర నుంచి కష్టపడుతూనే ఉన్నారు. కానీ బాబుకు మాత్రం కమ్మ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. ఇతర సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు మాత్రమే బాబుకు అండగా నిలుస్తున్నారు.

చంద్రబాబు మినహా మిగిలిన 10 మంది కమ్మ ఎమ్మెల్యేల్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ మొన్నటివరకు బాగా యాక్టివ్ గా ఉన్నారు. కానీ ఇటీవల ఆయన అనారోగ్య కారణాలతో కొంచెం రాజకీయాలకు దూరమయ్యారు. ఇటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ జంప్ కొట్టేందుకు చూస్తున్నారు. ఇక పి‌ఏ‌సి ఛైర్మన్‌గా ఉన్న పయ్యావుల కేశవ్ కూడా మునుపటిలా దూకుడు ప్రదర్శించడం లేదు. ఆయ‌న ప్ర‌స్తుతం హైద‌రాబాద్ హాస్ప‌టల్లో ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎలాగో సినిమాల్లో బిజీగా ఉన్నారు. బాల‌య్య‌కు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల బాధ‌లే ప‌ట్ట‌వు. ఇక స్టేట్ పార్టీ గురించి ఆలోచించే టైం ఎక్క‌డ ? ఉంటుంది.

అటు ప్రకాశం జిల్లాలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లోకల్ గా బాగా పని చేస్తున్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. ఆయన నాలుగు సార్లు గెలిచినా ఆయ‌న‌కు స్థానికంగా త‌ప్ప ప‌క్క నియోజ‌క‌వ‌ర్గ వైపు కూడా తొంగి చూడ‌రు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా అంతకముందులా యాక్టివ్ గా పని చేయడం లేదు. ఆయ‌న మీద కూడా జంపింగ్ జపాంగ్ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. వీళ్లు నియోజ‌క‌వ‌ర్గ బౌండ‌రీలు దాటి ఎప్పుడూ వెళ్ల‌లేదు. మొత్తానికి అధికారం లేకపోవడంతో కమ్మ ఎమ్మెల్యే అంతా సైలెంట్ అయిపోయిన‌ట్టే కనిపిస్తోంది.