Begin typing your search above and press return to search.

ఫస్ట్ డే 10.. 2డే 11 గంటల విచారణ.. ఈడీకి రాహుల్ సారీ ఎందుకు?

By:  Tupaki Desk   |   15 Jun 2022 5:31 AM GMT
ఫస్ట్ డే 10.. 2డే 11 గంటల విచారణ.. ఈడీకి రాహుల్ సారీ ఎందుకు?
X
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజకీయనేతల జీవితాలు మహా చిత్రంగా ఉంటాయి. తిరుగులేని అధికారాన్ని చెలాయించిన వారు.. తమకు నచ్చని అధినేతల్ని.. నేతల్ని కోర్టులు.. విచారణ సంస్థల చుట్టూ తిప్పేసినోళ్లు.. కాల ప్రవాహంలో తాము కూడా అలాంటి వాటి చుట్టూ తిరగాల్సి రావటం విధి వైచిత్రి కాక మరేంటి? దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన గాంధీ కుటుంబానికి చెందిన ఇద్దరు ఇవాల్టి రోజున ఈడీ చుట్టూ తిరగాల్సి రావటం దేనికి నిదర్శనం? తాము పవర్లో ఉన్నప్పుడు ఇప్పుడు పవర్ చెలాయిస్తున్న పలువురు నేతల్ని విచారణ సంస్థల చుట్టూ.. కోర్టు ల చుట్టూ తిప్పటం.. ఇప్పుడు వారే వెళ్లాల్సి రావటం కనిపిస్తుంది.

నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా.. రాహుల్ గాంధీలలో.. రాహుల్ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఎదుట వరుసగా రెండో రోజు హాజరు కావటం తెలిసిందే. మొదటి రోజు 10 గంటల పాటు విచారణను ఎదుర్కొన్న రాహుల్.. రెండో రోజు మరో 11 గంటల పాటు విచారణను ఎదుర్కోవటం గమనార్హం.

విచారణ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం పూర్తి కావాలన్న రాహుల్ మాటకు ఈడీ అధికారులు నో చెప్పటమే కాదు.. బుధవారం మళ్లీ రావాలన్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మొదలైన విచారణ అర్థరాత్రి 11.30 గంటల వరకు సాగటం విశేషం. మొదటి రోజు మాదిరే రెండో రోజు కూడా తన సోదరి ప్రియాంక వాద్రా వెంట రాగా ఈడీ కార్యాలయానికి 11.05 గంటలకు చేరుకున్న రాహుల్ గాంధీ.. రోజు మొత్తంలో రెండు దఫాలుగా ప్రశ్నలు ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు.

మంగళవారం దాదాపు పాతిక ప్రశ్నల వరకు ఎదుర్కొన్న రాహుల్.. తాను సమాధానాల్ని చెప్పాల్సిన వచ్చిన వాటికి ఆచితూచి అన్నట్లుగా బదులిచ్చినట్లుగా తెలుస్తోంది. న్యాయవాదులు ఆయన్ను బాగా శిక్షణ ఇచ్చి పంపినట్లుగా ఈడీ అధికారులు భావిస్తున్నట్లుగా సమాచారం. సుదీర్ఘంగా విచారించిన అధికారులు రాత్రి తొమ్మిదిన్నర గంటల వేళలో.. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయగా.. అందులో పలుమార్లు మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా విచారణ ప్రక్రియ ఆలస్యానికి కారణం మీరేనంటూ రాహుల్ ను ఈడీ అధికారులు పేర్కొనగా.. తన కారణంగా జరిగిన జాప్యంపై ఆయన సారీ చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈడీ విచారణ రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పేర్కొనటం.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించటం.. నిరసనలు చేపట్టటం లాంటివి నిర్వహించాయి. ఈడీని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వాహణ విభాగంగా ఉపయోగిస్తుందని.. రాజకీయ ప్రత్యర్థులపై ఐదు వేల కేసులు పెట్టినట్లుగా ఆరోపించారు.

ఏ నేత అయినా సరే బీజేపీలో చేరితే చాలు.. కేసులు మాయమవుతాయని మండిపడుతున్నారు. మొత్తంగా చూస్తే రాహుల్ ను విచారించిన ఈడీపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. వరుసగా రెండు రోజులు 10.. 11 గంటల చొప్పున ప్రశ్నలు ఎదుర్కొన్న రాహుల్ కు బుధవారం మరెన్ని గంటల పాటు విచారణ ఎదుర్కొనాల్సి వస్తుందో చూడాలి.