Begin typing your search above and press return to search.

మోడీ 1.0 సర్కారులో ఆలా ... మోడీ 2.0 సర్కారులో ఇలా !

By:  Tupaki Desk   |   28 July 2022 3:30 PM GMT
మోడీ 1.0 సర్కారులో  ఆలా ... మోడీ 2.0 సర్కారులో ఇలా !
X
ఏమి ఆవేశం? ఏమి ఆగ్రహం? అన్నట్లు ఉంది ఈ రోజు పార్లమెంటరీ సమావేశాల్ని చూసినప్పుడు. గతంలో ఏదైనా అంశం హాట్ టాపిక్ గా మారినప్పుడు విపక్షాలు ప్రశ్నించటం.. వాటికి మొత్తంగా మొత్తం కాకున్నా.. కొన్నింటి విషయాల్లో అయినా అధికారపక్షం సమాధానాలు చెప్పటం కనిపించేది. కానీ.. ఇప్పుడు అలాంటివేమీ కనిపించని పరిస్థితి. మోడీ 1.0లో అయితే కాస్త కాకుంటే కాస్త అయినా విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నట్లుగా ఉండేవారు. కానీ.. మోడీ 2.0 సర్కారులో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి.

ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే మాటే లేదన్నట్లుగా వ్యవహరించే మోడీ సర్కారు.. ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరు చేసిన వివాదాస్పద వ్యాఖ్య నేపథ్యంలో కమలనాథుల్లో ఆవేశం తన్నుకొచ్చింది. రాష్ట్రపతిని ఉద్దేశించి ఆ పార్టీ నేత అదిర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు ఒకరు కాదు ఇద్దరు కాదు మహిళా నేతలు తెగ సీరియస్ అయ్యారు.

ఇంత ఆగ్రహాన్ని ప్రదర్శించిన వారంతా.. మోడీ పాలనతో విదేశాల నుంచి తెచ్చిన అప్పుల లెక్క అడిగినప్పడు ఎందుకు పెదవి విప్పరు? ధరలు భారీగా పెరిగిపోతున్న వైనాన్ని నిలదీసినప్పుడు కూడా ఇంతే ఆవేశంతో సమాధానం ఇస్తే ఎంత బాగుండేది.

కానీ.. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం మానేసి మోడీ సర్కారు.. ఇప్పుడు అవకాశాన్ని చూసి.. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ల మీద డిమాండ్లు చేస్తున్నారు.

అత్యున్నత పదవిలో ఉన్న మహిళకు జరిగిన అవమానాన్ని సోనియా గాంధీ ఆమోదించినట్లుగా కేంద్ర మంత్రి స్మ్రతి ఇరానీ స్టేట్ మెంట్ ఇస్తే.. కొవిడ్ నేపథ్యంలో సభకు రాని మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన అభ్యంతరకర వ్యాఖ్య. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ విరుచుకుపడ్డారు.

రాష్ట్రపతిని ఉద్దేశించి రాష్ట్రపత్ని అంటూ అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యను బీజేపీ అండ్ కో తీవ్రంగా తప్పు పట్టటం తెలిసిందే. ఇదంతా చూస్తుంటే.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాలు సంధిస్తున్న ఏ ప్రశ్నకు సమాధానం చెప్పని కేంద్రం.. ఇప్పుడు మాత్రం తమకు దొరికిన చిన్న అవకాశాన్ని వినియోగించుకొని సభలో ఆగమాగం చేస్తుండటం చూస్తే.. సమాధానాలు చెప్పటానికి ఇష్టపడని మోడీ పరివారం.. విపక్షాల చేత ముక్కు రాయించే విషయంలో ఎంత పట్టుదలతో ఉంటుందన్న విషయం తాజా పరిణామాల్ని చూస్తే అర్థమవుతుందని చెప్పాలి. తప్పు చేసినోళ్లను నిలదీయాల్సిందే. అదే సమయంలో విపక్షాలు ప్రశ్నించే ప్రశ్నలకు ఇంతే స్పందన కమలనాథుల్లో ఉంటే ఎంత బాగుంటుంది?