Begin typing your search above and press return to search.

మోడీ పాలనపై ప్రముఖ ఆర్థిక నిపుణుడి మాటలు వినాల్సిందే!

By:  Tupaki Desk   |   20 Dec 2019 2:30 PM GMT
మోడీ పాలనపై ప్రముఖ ఆర్థిక నిపుణుడి మాటలు వినాల్సిందే!
X
రెండోసారి ఎన్నికల్లో సంపూర్ణ అధిక్యతను ప్రదర్శించి.. తనకు ఎదురు లేదన్న విషయాన్ని లోక్ సభ ఎన్నికల ఫలితాలతో ఫ్రూవ్ చేశారు మోడీ. మోడీ-1.. మోడీ-2లో ఇప్పటివరకూ సరైన కుంభకోణాలు ఏమీ బయటకు రాలేదు. రఫెల్ మీద రచ్చ జరిగినా.. అలాంటిదేమీ లేదన్న మాటను అత్యున్నత న్యాయస్థానం తేల్చేయటం తెలిసిందే.

మోడీ పాలన భేషుగ్గా ఉందని కీర్తిస్తున్న వేళ.. దేశ ఆర్థిక పరిస్థితి మందగమనంలో ప్రయాణించటంపై ఆర్థిక ప్రముఖులు పలువురు పెదవి విరుస్తున్నారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ కుదించుకుపోతుంటే.. స్టాక్ మార్కెట్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఎందుకిలా? అన్న దానికి ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి.

తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు ప్రముఖ ఆర్థికవేత్త.. ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్. 2014లో కేంద్ర ఆర్థిక శాఖకు సీఈఏగా మూడేళ్ల కాలానికి ఆయన ఎంపికయ్యారు. 2017లో ఆయన పదవీ కాలాన్ని పొడిగించారుకూడా. ఆయన పదవీ కాలం 2019 వరకూ ఉన్నప్పటికీ ఆయన మాత్రం గత ఏడాది (2018)లో తన పదవి నుంచి తప్పుకోవటమే కాదు.. విదేశాలకు వెళ్లిపోయారు.

తాజాగా ఐఐఎం అహ్మదాబాద్ పలు ఇతర సంస్థలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుబ్రమణియన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుంటే.. మరోవైపు స్టాక్ మార్కెట్ మాత్రం ఉత్సాహంగా పైపైకి పోవటం ఏమిటన్న ప్రశ్నను సంధించారు. తనకీ ఫజిల్ ఏ మాత్రం అర్థం కావటం లేదని.. ఒకవేళ దీని అర్థం తనకు తెలిసేలా చేస్తే తానుతిరిగి దేశానికి తిరిగి వస్తానంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

తాను లేవనెత్తిన అంశం మీద పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్న ఆయన మాటలు చూస్తే.. మోడీ సర్కారు డొల్లతనాన్ని ఎత్తి చూపేలా ఉందని చెప్పక తప్పదు. గతంలో మోడీ సర్కారు తీసుకున్న పెద్దనోట్ల రద్దును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. పెద్దనోట్ల రద్దుతో వృద్ధి రేటు తీవ్రంగా దెబ్బతినటంతో పాటు.. దిగ్భ్రాంతికరమైన నిరంకుశ చర్యగా అభివర్ణించారు. ఇంతకూ సుబ్రమణియన్ అడిగినట్లుగా ఆయనకు ఎంతకూ కొరుకుడుపడని ఫజిల్ ను ఎవరైనా పరిష్కరిస్తారా?