Begin typing your search above and press return to search.

తెలంగాణ నీటి వాడకం నుంచి షాకింగ్ అంశాలతో లేఖ రాసిన కీలక అధికారి

By:  Tupaki Desk   |   30 Jun 2021 3:31 AM GMT
తెలంగాణ నీటి వాడకం నుంచి షాకింగ్ అంశాలతో లేఖ రాసిన కీలక అధికారి
X
నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఎవరైనా చేసే పని. ఆవేశకావేశాలకు దూరంగా.. విడిపోయి కలిసి ఉందామన్న తెలంగాణ ఉద్యమ నినాదానికి ప్రతిరూపంగా ఏపీ వ్యవహరిస్తోంది. ఏపీ జలచౌర్యం చేస్తుందని.. దివంగత మహానేత వైఎస్ పెద్ద జలదొంగ అని.. ఆవేశంతో నోరు పారేసుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న తెలంగాణ అధికారపక్షానికి చెందిన కొందరు నేతల నోళ్లు మూత పడేలా..తెలంగాణ సమాజంతో పాటు ఏపీ ప్రజలకు సైతం కొన్ని అంశాలపై అవగాహన కల్పించేలా క్రిష్ణా బోర్డు కార్యదర్శికి ఏపీ ఈఎన్ సీ నారాయణరెడ్డి రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.

ఎందుకంటే.. ఇందులో పేర్కొన్న వాస్తవాలు ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది లేదు. ఎదుటోడి మీద మరక వేసేటప్పుడు.. ముందు మనం శుభ్రంగా ఉన్నామా? అన్నది చూసుకోవాలి. కానీ.. ఆ విషయంలో కేసీఆర్ సర్కారు తీరు కాస్త భిన్నంగా ఉందన్న వైనాన్ని ఆధారాల రూపంలో బయటపెట్టేశారు నారాయణరెడ్డి. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ హోదాలో ఆయన రాసిన లేఖలోని కీలక అంశాల్ని చూస్తే..
- శ్రీశైలం జలాశయం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తికి తెలంగాణ ఇక నుంచి నీళ్లు తీసుకోకుండా చూడాలి. తెలంగాణ యంత్రాంగాన్ని ఈ విషయంలో నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి విన్నవిస్తున్నాం.

- ఎన్నిసార్లు వద్దని చెబుతున్నా.. జలవిద్యుత్తు ఉత్పత్తి ఆపట్లేదు. అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. సోమవారం ఒక్కరోజే 16,877 క్యూసెక్కుల నీటిని జలవిద్యుత్తు కోసం తీసుకున్నారు.

- మరోవైపు వందశాతం జలవిద్యుత్తు ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం జెన్ కోకు ఆదేశాలు జారీ చేసింది. అదే జరిగితే.. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రం నుంచి రోజుకు నాలుగు టీఎంసీల విద్యుత్తు ఉత్పాదన కోసం వాడేస్తారని అర్థం. ఇది ఏపీ ప్రయోజనాల్ని పూర్తిగా దెబ్బ తీస్తుంది.

- వరదల సమయంలో మినహా మిగిలిన వేళల్లో శ్రీశైలం.. నాగార్జున సాగర్ ఉమ్మడి జలాశయాల నుంచి బోర్డు ఆదేశాలు లేకుండా నీటిని వాడుకోకూడదు. బోర్డు నుంచి ఎలాంటి ఆదేశం లేకుండానే తెలంగాణ ఏకపక్షంగా శ్రీశైలం నీటిని తీసుకుంటోంది.

- క్రిష్ణా బోర్డుకు కనీస సమాచారం ఇవ్వట్లేదు. ఉమ్మడి జలాశయాల నుంచి నీటి నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్లాలన్న ఒప్పంద సూత్రాల్ని ఉల్లంఘించినట్లే

- జూన్ ఒకటితో ప్రారంభమైన కొత్త నీటి సంవత్సరంలో ఇంతవరకు శ్రీశైల జలాశయానికి 17.36 టీఎంసీల నీటి ప్రవాహాలు వచ్చాయి. అందులో 6.9 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ వినియోగించుకుంటోంది. ఇది.. మొత్తం నీటి ప్రవాహాల్లో 40 శాతం.

- సాగర్ జలాశయంలో ఖరీఫ్ అవసరాల కోసం అవసరమైన నీళ్లున్నా.. తెలంగాణ శ్రీశైలం నీళ్లను వాడేస్తోంది. సాగర్ ఆయుకట్ట కింద క్రిష్ణా డెల్టాలో వ్యవసాయ అవసరాలకు నీటిని వినియోగించుకునే క్రమంలో శ్రీశైలం జల విద్యుత్త ఉత్పత్తి చేపట్టాలి. ఇలా శ్రీశైలం నుంచి నీళ్లను వాడుకుంటూ పోతే నీటి మట్టాలు పడిపోతాయి.

- పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకోవాలన్నా శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం ఉండాలి. అప్పుడు కూడా కేవలం 7వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకునే వీలుంది.

- తెలంగాణ పూర్తి జలవిద్యుత్తు ఉత్పత్తి చేపడితే ఏపీకి ఎంతో నష్టం. 854 అడుగుల నీటిమట్టం స్థాయికి నీళ్లు నిలిచే అవకాశం ఉండదు. పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకోవటం చాలా ఆలస్యమవుతుంది.