Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ ప్రసాద్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు?

By:  Tupaki Desk   |   10 Aug 2019 5:14 AM GMT
నిమ్మగడ్డ ప్రసాద్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు?
X
ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. ఇందూ టెక్ వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో సీబీఐ కోర్టు ఎదుట ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఇటీవల ఆయన సెర్బియా పర్యటనకు వెళ్లటం.. అక్కడి పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకోవటం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయనపై కోర్టు విచారణ సందర్భంగా సెర్బియాలో చోటుచేసుకున్న పరిణామాల్ని వివరించిన లాయరు.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాల్సిందిగా కోరారు. ఈసారి విచారణకు నిమ్మగడ్డ హాజరు కాలేదు. అదే సమయంలో ఆయన తరఫు లాయరు నిమ్మగడ్డ హాజరుకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎలాంటి పిటిషన్ ను దాఖలు చేయలేదు. దీంతో.. న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఇష్యూ చేశారు.

హాజరు మినహాయింపునక సంబంధించి నేర విచారణ చట్టం సెక్షన్ 317 కింద పిటిషన్ దాఖలు చేసేందుకు తమకు ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయలేదని చెబుతున్నారు. సెర్బియా పోలీసుల కస్టడీలో ఉన్న నిమ్మగడ్డను ఇండియాకు రప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయన తరఫు న్యాయవాదులు వ్యూహాత్మకంగా తాజా చర్య చేపట్టి ఉంటారని చెబుతున్నారు.

సీబీఐ ప్రత్యేక కోర్టు అరెస్ట్ వారెంట్ ను చూపించి ఆయన్ను భారత్ కు రప్పించే దిశగా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారా? అన్న వాదన తాజాగా వినిపిస్తోంది. మరి.. సీబీఐ ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ తో అయినా నిమ్మగడ్డ ఇండియాకు తిరిగి వస్తారేమో చూడాలి.