Begin typing your search above and press return to search.

ఒంటరిగా పోరాడుతున్న జానా..?

By:  Tupaki Desk   |   3 April 2021 1:30 PM GMT
ఒంటరిగా పోరాడుతున్న జానా..?
X
ఎవరెన్ని చెప్పినా.. తమ తీరు మార్చుకోని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. దాని మీద ఎవరికి అదుపు ఉండదు. పేరుకు అధినాయకత్వమే కానీ.. పవర్ లో ఉన్నప్పుడు ఒకలాంటి సమస్యలు.. పవర్ పోయినప్పుడు మరోలాంటి సమస్యలతో కిందా మీదా పడటమే తప్పించి.. జరిగిన తప్పుల్లో నుంచి పాఠాలు నేర్వని గుణం ఆ పార్టీ సొంతం. చేతిలో అధికారం లేకున్నా ఫర్లేదు కానీ.. అంతర్గత కుమ్ములాటల్లో కిందా మీదా పడిపోవటం ఆ పార్టీకే చెల్లు. వరుస ఎదురుదెబ్బలతో తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ వారిలో మార్పు రాకపోవటం విశేషం.

తాజాగా జరుగుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు నేపథ్యంలో.. కాంగ్రెస్ నేతలంతా నియోజకవర్గం మీద పడి.. జానా గెలుపు తమ సొంత గెలుపు అనుకుంటే.. అధికార టీఆర్ఎస్ కు షాకిచ్చే పరిస్థితి ఉంది. కానీ.. అందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా లేరనే చెప్పాలి.

ఇప్పటికే వర్గపోరుతో కిందామీదా పడుతున్ పార్టీ.. సాగర్ ఉప ఎన్నికల్లో జానా కానీ విజయం సాధిస్తే.. పార్టీ ఆయనకు ప్రాధాన్యత ఇస్తుందని.. అదే జరిగితే తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయన్న యోచనలో ఉన్న పార్టీ నేతలు.. ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.

అయితే.. పార్టీ ఉంటేనే తాము ఉంటామన్న చిన్న సూత్రాన్ని వదిలేసి.. తమ ప్రయోజనాలు తప్పించి పార్టీ ప్రయోజనాలు పట్టని కారణంగా సాగర్ లో జానా ఒక్కరే ఒంటరిగా ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి. హంగు.. ఆర్భాటంతో పాటు.. నేతలు పుష్కలంగా ఉన్న కాంగ్రెస్ కు ఐకమత్యం ఒక్కటే ఉండదు. అదే.. ఆ పార్టీని ఈ రోజున ఇప్పుడున్న పరిస్థితికి తీసుకొచ్చింది. అయినప్పటికి గుణాపాఠాలు నేర్వకుండా నేతలు వ్యవహరిస్తున్న తీరు విస్తుపోయేలా చేస్తోంది. ఇప్పటికి తీరు మార్చుకోకపోతే.. ఉనికే ప్రశ్నార్థకమవుతుందన్న సత్యాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు గుర్తించరో?