Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'విశాఖ సౌత్‌' ఎవరి సొత్తు..?

By:  Tupaki Desk   |   31 March 2019 6:41 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: విశాఖ సౌత్‌ ఎవరి సొత్తు..?
X
అసెంబ్లీ నియోజకవర్గం : విశాఖ దక్షిణం
టీడీపీ: వాసుపల్లి గణేశ్‌ కుమార్‌
వైైసీపీ: ద్రోణంరాజు శ్రీనివాస్‌
జనసేన: గంపల గిరిధర్‌

స్వాతంత్య్రోదమ నేపథ్యాలను గుర్తుచేసే భవనాలు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కనిపిస్తాయి. జాతిపిత గాంధీజీ నడిచిన ప్రాంతం, ప్రతిష్టాత్మక పోర్టు ఈ నియోజకవర్గంలో కనిపిస్తాయి. కింగ్‌ జార్జ్‌ ఆసుపత్రి, చారిత్రక ఆలయాలు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు విశాఖ దక్షిణం నియోజకవర్గంలో అసెంబ్లీ పోరు ఆసక్తిగా మారింది. సార్వత్రిక పోరులో భాగంగా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన వాసుపల్లి గణేశ్‌ మరోసారి టీడీపీ నుంచే పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి ద్రోణం రాజు బరిలో ఉన్నారు. గంపల గిరిధర్‌ జనసేన నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


విశాఖ దక్షిణం నియోజకవర్గం చరిత్ర:
వార్డులు:16
ఓటర్లు: 2 లక్షల 9వేలు

స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1952లో విశాఖ-1 నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతం నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా 2009లో విశాఖ దక్షిణ నియోజకవర్గంగా అవతరించింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఏర్పడిన తరువాత రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి ద్రోణం శ్రీనివాస్‌ గెలుపొదారు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌పై ఏర్పడిన వ్యతరేకతతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను ఇక్కడి ప్రజలు పట్టించుకోలేదు. దీంతో టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేశ్‌ విజయం సాధించారు.

* వాసుపల్లి గణేశ్‌ మరోసారి టీడీపీని గెలిపిస్తాడా..?
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన వాసుపల్లి గణేశ్‌ ను నియోజకవర్గ ప్రజలు మరోసారి గెలిపిస్తారా..? అంటే వ్యతిరేకతతో ఆయన గెలుపు కష్టమవుతుందా అన్న చర్చ సాగుతోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఈ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ, ఇతర సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో ఆయన అధికారంలో ఉన్న టీడీపీలో ఉన్నా చేసిందేమీ లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వాసుపల్లి చెబుతున్నారు. అన్ని పోర్టులను ఆధునీకరించామని చెబుతున్నారు. సుమారు రూ.4500 కోట్లతో జీవ పొల్యూషన్‌ను తయారు చేశామంటున్నారు. అలాగే సెంట్రల్‌ పార్క్‌ను కూడా కేటాయించామంటున్నారు. అధికార టీడీపీ అండదండలు, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

* అనుకూలతలు:
-ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం
-పార్టీ బలపడడం
-టౌన్‌లో అభివృద్ధి పనులు

* ప్రతికూలతలు:
-కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత
-ప్రజలను పట్టించుకోలేదనే వాదన

* ద్రోణంరాజు శ్రీనివాస్‌ వైసీపీ జెండా ఎగురవేసేనా?
2006లో ద్రోణంరాజు సత్యనారాయణ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్‌ గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014లో మాత్రం టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేశ్‌ చేతిలో ఓటమి చెందారు. ఇటీవల ఆయన వైసీపీ తీర్థం పుచుకుకొని ఆ పార్టీ నుంచి టికెట్‌ సాధించారు. నియోజకవర్గంలో శాంతి సౌమ్ముడిగా పేరున్న ద్రోణం రాజు ప్రత్యర్థిపై వస్తున్న వ్యతిరేకతను ఆధారంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండేవాడినని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక వైసీపీ గాలి, జగన్ మేనియానే తనను గెలిపిస్తుందని ఆశలు పెంచుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కలిసిరావడంతో ఆయన గెలుపుపై ఆశలు పెంచుకున్నారు.

* అనుకూలతలు:
-తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు
-వ్యక్తిగతంగా మంచిపేరు

* ప్రతికూలతలు:
-కాంగ్రెస్‌ నుంచి వైసీపీలోకి చేరడం
-వైసీపీపై అసంతృప్తిగా ఉండడం

*టఫ్ ఫైట్ లో గెలిచేదెవరు?
ప్రధానంగా టీడీపీ, వైసీపీల మధ్యే పోరు సాగుతుండగా మధ్యలో జనసేన ప్రభావం అంతంత మాత్రమేనని చెప్పొచ్చు. కాంగ్రెస్‌ పరిస్థితి కూడా బాగా లేదనే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి టీడీపీ జెండా ఎగురవేయడానికి వాసుపల్లి తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. ఈసారి కచ్చితంగా గెలుస్తానని ద్రోణం రాజు శ్రీనివాస్‌ చెబుతున్నాడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం తన హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే జనసేన ఓట్లే చీలికే ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ గెలుపును ప్రభావితం చేస్తుంది. అందుకే ఎవ్వరైనా గెలిచే చాన్స్ ఉందని అంటున్నారు.