Begin typing your search above and press return to search.

ఐదు రాష్ట్రాల్లో గెలిచేదెవరు..?

By:  Tupaki Desk   |   5 March 2016 4:22 AM GMT
ఐదు రాష్ట్రాల్లో గెలిచేదెవరు..?
X
మరో ఎన్నికల సంరంభానికి తెర తీశారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ తాజాగా విడుదల చేసింది. సుదీర్ఘంగా సాగే ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 4 నుంచి మొదలై మే 16 వరకు సాగనుంది. మొత్తం ఆరు దశల్లో ఏడు రోజుల పాటు సాగే పోలింగ్ కు సంబంధించిన ఫలితాలు మే 19న విడుదల కానున్నాయి.

మినీ భారత్ ఎన్నికలుగా అభివర్ణిస్తున్న ఈ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. దక్షిణ భారతంలో రెండు రాష్ట్రాలు.. ఒక కేంద్రపాలిత ప్రాంతం (పుదుచ్చేరి).. ఈశాన్య భారతమైన పశ్చిమ బెంగాల్.. అసోం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ రాజకీయాల మీద ప్రభావం చూపించే ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్.. బీజేపీలకు ఇబ్బందికర పరిస్థితి ఎదురు కానుంది. ఎందుకంటే.. తాజాగా ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో బీజేపీ.. కాంగ్రెస్ రాష్ట్రాలకు ఏమాత్రం బలం లేనివే. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల తుది ఫలితం ఎలా ఉండనుంది? అన్నది ఆసక్తికరమనే చెప్పాలి.
ఇప్పటికే ఉన్న అంచనాల ప్రకారం.. ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయంటే..

తమిళనాడు

తమిళనాడు రాజకీయాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి అధికారం ఇచ్చిన పార్టీకి వరుసగా మరోసారి అధికారం ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఎప్పటికప్పుడు అధికారాన్ని మార్చేస్తూ తమ విలక్షణతను ప్రదర్శిస్తుంటారు. తాజాగా జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉంది. ఈసారి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒంటరిగా పోటీ చేస్తుండగా.. డీఎంకే.. కాంగ్రెస్.. విజయకాంత్ కు చెందిన కూటమి కలిసి పోటీ చేయనుంది. ఇక.. బీజేపీ పొత్తుల్ని ఇంకా ఖరారు చేసుకోలేదు. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం జయలలితకు గడ్డు పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. తన ఐదేళ్ల పదవీకాలంలో ‘అమ్మ’ బ్రాండ్ తో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా.. మొన్నామధ్య చోటు చేసుకున్న భారీ వర్షాలు.. వరదల సమయంలో జయ సర్కారు అనుసరించిన విధానంపై తమిళులు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ఒకసారి అధికారాన్ని వరుసగా మరోసారి ఇచ్చే అలవాటు లేని తమిళులు జయలలితకు పవర్ ను కట్టబెట్టటం కష్టమన్న మాట వినిపిస్తోంది.

పుదుచ్చేరి

ఈ కేంద్రపాలిత ప్రాంతంలో డీఎంకే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. 30 అసెంబ్లీ స్థానాలున్న ఈ బుజ్జి రాష్ట్రంలో అధికారం తమిళనాడు ఫలితానికి దగ్గరగా ఉండనుంది.

కేరళ

కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఉమెన్ చాందీ సర్కారును వరుస కుంభకోణాలు కుంగదీస్తున్నాయి. తాజాగా జరగనున్న ఎన్నికల్లో వామపక్ష కూటమికే ఈసారి అధికారం చేజిక్కించుకునే వీలుంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో వామపక్షాలు విజయం సాధించటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.

పశ్చిమబెంగాల్

మమతా బెనర్జీ అధికారంలో ఉన్నఈ రాష్ట్రంలో.. ఈసారి ఎన్నికల్లోనూ మమత మేజిక్ పక్కా అని చెప్పొచ్చు. కొన్ని కుంభకోణాలు ఆమె పాలనలో ఉన్నా.. స్థానికంగా ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం ఖాయం కానుంది. 294 స్థానాలున్న పశ్చిమబెంగాల్ లో బీజేపీ తన ప్రభావాన్ని అస్సలు చూపించలేదని చెబుతున్నారు. బీజేపీని దెబ్బ తీసే పనిలో భాగంగా అధికార తృణమూల్ కు కాంగ్రెస్.. కమ్యూనిస్ట్ లు లోపాయికారీగా సాయం అందించటమే దీనికి కారణంగా చెప్పొచ్చు.

అసోం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఆనందం కలిగించే అంశం ఏమైనా ఉందా? అంటే అది అసోం రాష్ట్ర ఫలితమే. తాజాగా అక్కడ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో బీజేపీ బలోపేతంగా మారటమే కాదు.. ఆ రాష్ట్రంలో తొలిసారి కాషాయ జెండా విజయగర్వంతో ఎగరనుందని ఖాయంగా చెప్పొచ్చు.