Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీలో పోటీ చేసేదెవరు..?

By:  Tupaki Desk   |   11 March 2019 2:30 PM GMT
ఏపీ బీజేపీలో పోటీ చేసేదెవరు..?
X
ప్రస్తుతం కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ పరిస్థితి... ఏపీలో మాత్రం దయనీయంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసి కొన్ని సీట్లు తెచ్చుకున్న కమలం పార్టీ ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగనుంది. మొన్నటి వరకు ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేవరకు చూద్దాంలే.. అనుకున్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఆ సమయం కూడా రావడంతో అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికలకు కేవలం నెలరోజులే వ్యవధి ఉండడంతో అభ్యర్థుల్లో ఎవరిని నిలబెట్టాలనే ఆలోచన ఆ పార్టీలో ఇప్పటికీ ఎవరికి లేకపోవడం విచిత్రంగా ఉందని ఇతర పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు..

ఏదైనా చర్చలు ఉంటే బీజేపీ నాయకులు కేంద్రం వైపు మాట్లాడేందుకు మేమున్నామంటూ ముందుకు వస్తారు.. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ సైతం ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనన్న స్పష్టత ఇంతరవకు రాలేదట. ఈ నేపథ్యంలో అభ్యర్థుల లిస్టు ఇంకా ఎప్పుడు తయారు చేస్తారని, పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు నిరుత్సాహ పడుతున్నారు.

ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. రేపో మాపో ప్రచారాన్ని కూడా ప్రారంభించే పనిలో ఉన్నాయి. ఇటీవల మోడీ పర్యటనతో తమలో ఉత్సాహం నెలకొందని కొందరు బీజేపీ నేతలు ఉరకలేస్తున్నా... ఎన్నికలకు తక్కువ సమయం ఉందనేసరికి పోటీకి భయపడుతున్నారు. ప్రస్తుతం పార్టీలో కన్నా లక్ష్మీనారాయణతో పాటు సోమ వీర్రాజు- మాణిక్యాలరావు- విష్ణుకుమార్‌ రాజు- విష్ణువర్ధన్‌ రెడ్డి- గోకరాజు గంగరాజు లాంటి రాష్ట్రనేతలు ఉన్నారు. అలాగే రామ్‌ మాధవ్‌- జీవీఎల్‌ నరసింహారావు లాంటి జాతీయ నేతలు ఉన్నారు.

రాష్ట్రనేతల్లోని ముఖ్యుల్లో ఉన్న పురంధేశ్వరి తన కుమారుడిని వైసీపీలోకి పంపించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె కూడా ఓ స్థానం నుంచి వైసీపీ టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. సోమవీర్రాజు గత ఎన్నికల్లోనే పోటీకి వెనుకాడారు. ఇప్పుడు పోటీ చేసే ప్రసక్తి కనిపించడం లేదని అనుకుంటున్నారు. విష్ణువర్దన్‌ రెడ్డి టీవీ చర్చల్లో తప్ప ప్రజల్లోకి వెళ్లి వాదించే సత్తా లేదని కొందరి అభిప్రాయం.

బీజేపీ జాతీయ నేతలైనా రామ్‌ మాధవ్‌, జీవీఎల్‌ లోక్‌ సభలో బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతున్నా వారు మాత్రం ఆసక్తిని చూపడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీలో ఉంటుందా..? లేదా..? అనే అనుమానాలు సాగుతున్నాయి. దీంతో ఏపీలో బీజేపీకి దిక్కెవరు..? అంటూ సెటైర్లు పడుతున్నాయి...