Begin typing your search above and press return to search.

అప్పుడు చేసిన అప్పెవరు తీర్చాలి

By:  Tupaki Desk   |   13 April 2015 12:14 PM GMT
అప్పుడు చేసిన అప్పెవరు తీర్చాలి
X
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య లెక్కలేనన్ని గొడవలు.... ఒకటి సమసిపోతే ఇంకోటి మొదలవుతోంది. తాజాగా రెండు రాష్ట్రాల మధ్య మరో చిచ్చు రుగులుతోంది. విదేశీ అప్పులు ఏ రాష్ట్రం చెల్లించాలనే విషయంపై ఈ వివాదం సాగుతోంది. కరెంటు, జలాలు, ఎమ్సెట్‌, ఇంటర్‌ పరీక్షలు, ఆర్టీసి వంటి వివాదాలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల

మధ్య చెలరేగుతుండగానే తాజాగా ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన అప్పులను తీర్చే విషయమై రెండు రాష్ట్రాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజన్సీ నుంచి దాదాపు 9 వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పటి ప్రభుత్వాలు ఈ రుణాలు

తీసుకున్నాయి. కాగా ఇప్పు డు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రుణాలను తీర్చే విషయమై రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు తలెత్తాయి. జనాభా ప్రాతిపదికన రుణాలను విభజించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. కానీ, ఏ రాష్ట్రంలో ఆ అప్పులతో ప్రాజెక్టులను చేపడితే ఆ రాష్ట్రానికి ఆ అప్పులను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాదిస్తోంది. ఒక వేళ జనాభా ప్రాతిపదికన అయితే మొత్తం

అప్పుల్లో 58 శాతం రుణాలను చెల్లించడం భారమవుతోందని, ఇప్పటికే ఆర్థిక లోటుతో కృంగిపోతున్న తమకు శక్తికి మించిన పని ఆంధ్రప్రదేశ్‌ వాదిస్తోంది. విభజనకు ముందు విదేశీ ఏజన్సీలనుంచి తెచ్చిన రుణంలో పెద్ద మొత్తాలను తెలంగాణ ప్రాజెక్టులకే వెచ్చించారని ఏపి ప్రభుత్వం అంటోంది. హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు రూ. 199 కోట్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు రూ. 1953 కోట్లు, హైదరాబాద్‌లో

విద్యుత్‌ నెట్‌వర్క్‌ అభివృద్ధికి రూ. 776 కోట్ల రుణాలను వెచ్చించారు. అందువల్ల ఆ అప్పులను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని ఎపి వాదిస్తోంది.
రెండు రాష్ట్రాల మధ్య రుణాల విభజన బాధ్యతను ప్రస్తుతం కేంద్రం కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(కాగ్‌)కు అప్పగించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తమ అభిప్రాయాలు, రుణాలు తీర్చే ఫార్ములాలను తెలియచేయాలని ఇప్పటికే కాగ్‌ కోరింది. ఒక వేళ జనాభా ప్రాతిపదికనే చెల్లించే ఫార్ములాకు కాగ్‌ అంగీకరిస్తే ఎపిపై తడిసి మోపెడు భారం పడుతుంది.

అప్పు డు ఆంధ్ర ప్రభుత్వం రూ. 5096 కోట్ల రుణాలను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏపి ప్రభుత్వం చెప్పినట్లు ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని బట్టి రుణాల వాటాను నిర్ణయించినట్లయితే, తెలంగాణ రూ. 5250 కోట్లు, ఆంధ్ర రూ. 3705 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాలు కూడా రుణాలను తీర్చే విషయంలో ఏకాభిప్రాయానికి రావడంలేదు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రచ్చ మొదలవుతోంది.