Begin typing your search above and press return to search.

వివేకా మృతి.. డోర్ లాక్ ఎవరు తీశారు?

By:  Tupaki Desk   |   15 March 2019 10:22 AM GMT
వివేకా మృతి.. డోర్ లాక్ ఎవరు తీశారు?
X
వైఎస్ వివేకానందరెడ్డి మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన అకాల మరణంపై సందేహాలు వ్యక్తం చేస్తూ వివేకానందారెడ్డి పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో అలెర్ట్ అయిన పోలీసులు విచారణ చేపట్టారు.

తాజాగా వివేకానందరెడ్డి నివాసంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహించారు. బెడ్ రూంలో ఏసీ ఉన్నప్పటికీ డోర్ ఎందుకు ఓపెన్ చేసి ఉంచారు? సైడ్ డోర్ లాక్ ఎవరు తీశారన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనివెనుక హత్యకోణం ఉందన్న అనుమానాలు పోలీసులు పరిశీలించాక బయటపడ్డాయని వార్తలు వస్తున్నాయి.

వివేకానందరెడ్డి మృతి తర్వాత పరిశీలించిన సీఐ మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందారెడ్డి మృతిపై సెక్షన్ 171సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాత్రూమ్ లో అనుమానాస్పదంగా పడి ఉన్నారని.. తలపై గాయాలున్నాయని ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు.

ఇక వైఎస్ వివేకా మృతి రాజకీయ దుమారం రేగడంతో ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేసేందుకు కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ రంగంలోకి దిగారు. వెంటనే అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన సిట్ బృందం ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిఫుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నారు. ఘటన స్థలాన్ని స్వాధీనం చేసుకొని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నామని.. విచారణలో ఎవరి పాత్ర ఉందన్న దానిపై ఆరాతీస్తున్నామని.. కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.