Begin typing your search above and press return to search.

తెలంగాణలో సంపన్న నేత ? పేద నేత ఎవరంటే ?

By:  Tupaki Desk   |   4 Dec 2018 9:51 AM GMT
తెలంగాణలో సంపన్న నేత ? పేద నేత ఎవరంటే ?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వేళయ్యింది. అభ్యర్థులంతా హోరా హోరీ ప్రచారంతో దూసుకుపోతున్నారు. అభ్యర్థులంతా ఇప్పటికే నామినేషన్లు వేసేశారు. ఆస్తుల చిట్టాను బయటపెట్టారు. తాజాగా ప్రసార మాధ్యమాల్లో తమ పై ఉన్న కేసుల వివరాలను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ వాచ్ సంస్థ అభ్యర్థుల అఫిడవిట్ల ను పరిశీలించి తెలంగాణ బరిలో నిలిచిన మొత్తం అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడు, అత్యంత పేద అభ్యర్థి ఎవరో తెలిపింది.

నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణలో ఉన్న మొత్తం అభ్యర్థులందరికీలోకి ధనవంతుడు. ఈయన తన అఫిడవిట్ లో రూ.266.86 కోట్ల చరాస్తులు, రూ.47.45 కోట్ల స్థిరాస్తులను చూపారు. మొత్తంగా ఈయన, ఈయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఆస్తుల విలువ రూ.314 కోట్లకు పైగానే ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో బాల్కొండ బీఎస్పీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ ఆస్తులు రూ.182.66 కోట్లతో నిలిచారు. నాగర్ కర్నూల్ టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనర్ధాన్ రెడ్డి రూ.161.29 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు.

ఇక తెలంగాణలోనే అత్యంత పేద అభ్యర్థిగా నిజామాబాద్ అర్బన్ స్వతంత్ర అభ్యర్థి బల్ల శ్రీనివాస్ నిలిచారు. ఈయన తన ఆస్తిని కేవలం రూ.15గా చూపారు. ఇక ఆ తర్వాత కోరుట్ల స్వతంత్ర అభ్యర్థి జగిలం రమేశ్ రూ.500, పెద్దపల్లి సమాజ్ వాదీ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి రూ.500 ఆస్తులు చూపారు. ఇక ‘సున్న’ ఆస్తులను తెలంగాణలోని 58మంది అభ్యర్థులు చూపించడం విశేషంగా చెప్పవచ్చు.

ఇక అప్పుల్లోనూ ఆరితేరిన వారి లెక్క తేలింది. బాల్కొండ బీఎస్పీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ రూ.144 కోట్లు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకున్నట్టు ఆఫిడవిట్ లో చూపారు. అత్యధిక అప్పులున్న తెలంగాణ అభ్యర్థిగా ఈయన మొదటి స్థానంలో నిలిచారు. ఇక పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి 94 కోట్లు, నాగర్ కర్నూల్ టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి అప్పులు రూ.63కోట్లుగా చూపారు.

తెలంగాణలో విద్యావంతుల చిట్టాను కూడా సంస్థ వెలికితీసింది. తెలంగాణలో మొత్తం పోటీచేస్తున్న 1777మందిలో 5-12వ తరగతి చదివిన వారు 799మంది, డిగ్రీ చదివిన వారు 845మంది, అస్సలు చదువుకోని వారు 48మంది ఉన్నారని తేల్చారు.

జనాభాలో సగం ఉన్న మహిళలకు ఎన్నికల్లో సముచిత ప్రాధాన్యం దక్కలేదని ఎలక్షన్ వాచ్ పేర్కొంది. మొత్తం అభ్యర్థుల్లో 8శాతం అంటే కేవలం 136మంది మహిళలు మాత్రమే బరిలో నిలిచినట్లు ఎలక్షన్ వాచ్ తెలిపింది.