Begin typing your search above and press return to search.

వంశీ క్షమాపణ వెనుక ఉన్నదెవరు ?

By:  Tupaki Desk   |   2 Dec 2021 4:32 PM GMT
వంశీ క్షమాపణ వెనుక ఉన్నదెవరు ?
X
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కాస్త ఆలస్యంగా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలపై వంశీ పశ్చాత్తాపం ప్రకటించారు. ఎట్టకేలకు భువనేశ్వరికి చంద్రబాబుకు క్షమాపణ చెప్పారు. భువనేశ్వరిపై పొరపాటున వ్యాఖ్యలు చేశానని, తప్పుగా దొర్లిందని చెప్పుకొచ్చారు. టీడీపీలో భువనేశ్వరి అందరికంటే ఆత్మీయురాలని, తాను అక్కా అని పిలుస్తానని వంశీ తెలిపారు. ఆమెతో పాటు తన మాటల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణ చెప్పారు. ఈ వివాదంలో అందరూ సంయమనం పాటించాలని కోరారు. ఇంకోసారి ఇలాంటి తప్పు దొర్లదని హామీ ఇచ్చారు. జరిగినదానికి వంశీ విచారం వ్యక్తం చేశారు.

వాస్తవంగా వంశీ చేసిన వ్యాఖ్యల కంటే అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అసెంబ్లీలో జరిగిన ఘటను అందరూ తప్పుబట్టారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ, ప్రముఖులు భువనేశ్వరికి అండగా నిలిచారు. అయితే వంశీ ఆలస్యంగా భువనేశ్వరికి క్షమాపణ చెప్పడం అందరీని ఆశ్చర్యానికి గురిచేసింది. వంశీ క్షమాపణ చెప్పడానికి కారణం ఏమైఉంటుందని ఆరా తీస్తున్నారు. వంశీని శాశ్వతంగా బహిష్కరించాలని కమ్మ సామాజికవర్గం నిర్ణయించడంతో ఆయన తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. కొందరు కమ్మ నేతలు కూడా ఆయన తలపై ధర ప్రకటించినట్లు సమాచారం.

జగన్ సూచనతోనే వంశీ తగ్గారనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే భువనేశ్వరిపై వంశీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. మహిళల్లో పార్టీపై నెగిటివ్ ఇమేజ్ ఏర్పడిందని నిఘా విభాగం నుంచి జగన్ కు ఫీడ్ బ్యాక్ అందినట్లు సమాచారం. కమ్మోళ్లపై అటాక్ చేద్దామనుకుంటే మొత్తం లేడీస్ లో నెగెటివ్ అయ్యేలా ఉందన్న భయంతో జగన్ తప్పు దిద్దుకునే చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.

గన్నవరం నియోజకవర్గంలోనే వంశీ వ్యాఖ్యలతో ఆయన ఇమేజ్ బాగా పడిపోయిందని వైసీపీ నేతలు భయపడుతున్నారని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గం పూర్తిగా వైసీపీని వెలివేస్తారనే భయం కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. కమ్మ సామాజిక వర్గ కుటుంబాలు గత ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచాయి. తాము వైసీపీకి వ్యతిరేకం కాదనే సంకేతాలు కూడా పంపారు. ఈ సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ కాదని వైసీపీని గెలిపించుకున్నారని అప్పట్లో అనేక విశ్లేషణలు వచ్చాయి.

టీడీపీ ఆవిర్భావం నుంచి కమ్మ సామాజిక వర్గం ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉంది. గతానికి భిన్నంగా ఈ వర్గం పలు చోట్ల వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేసి తాము వైసీపీకి వ్యతిరేకం కాదని చెప్పాయి. వీరి ఓటు బ్యాంకును వైసీపీ దూరం చేసుకునే సాహసం చేయదనే విశ్లేషణలు వస్తున్నాయి. గన్నవరంలో కూడా కమ్మ సామాజికవర్గం ప్రభావం చాలా ఉంది. ఈ సామాజిక వర్గం గన్నవరంలో గెలుపును శాషించే స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. వంశీ వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సామాజిక వర్గం మాత్రమే కాకుండా చాలామంది మహిళలు వైసీపీకి దూరం అవుతారనే భయం వైసీపీని వెంటాడుతోందని చెబుతున్నారు. అందువల్లే వంశీతో భువనేశ్వరికి క్షమాపణ చెప్పించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.