Begin typing your search above and press return to search.

భారత్ కు డబ్ల్యూహెచ్ వో అరుదైన గౌరవం

By:  Tupaki Desk   |   13 Nov 2020 5:30 PM GMT
భారత్ కు డబ్ల్యూహెచ్ వో అరుదైన గౌరవం
X
కరోనాపై భారత్ పోరాడిన తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు పలు దేశాలు కొనియాడిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని ఏ దేశంలో వ్యాక్సిన్ ముందుగా కనిపెట్టినా....దానిలో సింహభాగం ఉత్పత్తి మాత్రం భారత్ లో జరుగుతుందని ఇప్పటికే పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. సాంప్ర‌దాయ వైద్యానికి సంబంధించి ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించేంద‌ుకు భార‌త్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. సాంప్ర‌దాయ వైద్యానికి చెందిన ఆధారాల‌ను, ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ‌, అవగాహ‌న‌ను పెంచుకోనున్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌న‌మ్ గెబ్రియాసిస్ వెల్లడించారు. భారత్ లో ట్రెడిష‌నల్‌ మెడిసిన్‌పై గ్లోబ‌ల్ సెంట‌ర్‌ను డ‌బ్ల్యూహెచ్‌వో ఏర్పాటు చేయ‌బోతోంద‌ని టెడ్రోస్ తెలిపారు. జైపూర్‌, జామ్‌న‌గ‌ర్‌లో ఏర్పాటు చేయ‌నున్న ఆయుర్వేద ఇన్స్‌టిట్యూట్‌ల‌ను ప్ర‌ధాని మోదీ ప్రారంభించిన సంద‌ర్భంగా టెడ్రోస్ పంపిన వీడియో సందేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2014-2023 ద‌శాబ్దానికి సంప్ర‌దాయ వైద్య వ్యూహాన్ని డ‌బ్ల్యూహెచ్‌వో ర‌చించింద‌ని, గ్లోబ‌ల్ సెంట‌ర్ ఏర్పాటు వల్ల ఆ వ్యూహాలు స‌ఫలమవుతాయని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.

ఆయుర్వేద దినోత్సవాల సందర్భంగా జామ్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదను, జైపూర్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను మోదీ ప్రారంభించారు. ట్రెడిష‌న‌ల్ మెడిసిన్ గ్లోబ‌ల్ సెంట‌ర్ కోసం ఇండియాను ఎంపిక చేయ‌డం గ‌ర్వంగా ఉందని ప్ర‌ధాని మోదీ అన్నారు. వైద్య రంగంలో ఆయుర్వేదం కీలక పాత్ర పోషిస్తోందని, ఆయుర్వేదాన్ని 21వ శతాబ్దపు సైన్స్‌తో జోడించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి నియంత్రణకు ప్రతి కుటుంబం పసుపు కలిపిన పాలు, అశ్వగంధ వంటివాటిని ఉపయోగించడమేనని అన్నారు. భవిష్యత్తులో ఆయుర్వేదం, అల్లోపతి కలిసి అద్భుతాలు సృష్టిస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు.