Begin typing your search above and press return to search.

వీడని కరోనా గుట్టు.. చైనాతో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ చర్చ

By:  Tupaki Desk   |   6 Feb 2022 8:30 AM GMT
వీడని కరోనా గుట్టు.. చైనాతో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ చర్చ
X
కరోనా మహమ్మారి మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. తొలి కేసు చైనాలోని వుహాన్ లో నమోదైంది. ఆ తర్వాత ప్రపంచ దేశాలకు పాకింది. ఇక వైరస్ మూల రూపం నుంచి వేరియంట్ల మాదిరిగా రూపాంతరం చెందుతూ వస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో దశల వారీగా తీవ్ర ప్రభావం చూపుతోంది. కాగా వైరస్ చైనా ల్యాబ్ లోనే పుట్టిందని పలు దేశాలు ఆరోపించాయి. బయో సృష్టి అనే అపవాదును చైనా మూటగట్టుకుంది. అగ్రరాజ్యం అమెరికా డ్రాగన్ కంట్రీ పై విరుచుకు పడింది. అంతే కాకుండా రహస్యంగా ఓ నివేదికను కూడా తయారు చేసింది. అయితే చైనాపై ఉన్న అనుమానాలు ఇప్పటికీ పోలేదు.

కరోనా వైరస్ మూలాల అధ్యయనంపై చైనా సహకరించలేదని పలు దేశాలు ఆరోపించాయి. ఇందుకు డబ్ల్యూహెచ్ఓ కూడా ఆ దేశానికి సహాయం చేస్తోందని నిందలు వేశాయి. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గాబ్రియస్... చైనా ప్రధానితో చర్చించారు. డ్రాగన్ పీఎం లీ కేకీయాంగ్ తో సమావేశమైనట్లు టెడ్రస్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ భేటీలో కొవిడ్ పుట్టుకపై కీలక సమాచారం సేకరించినట్లు తెలిపారు.

చైనా తో చర్చించడం చాలా సంతోషంగా ఉందని టెడ్రస్ అన్నారు. వివిధ దేశాల్లో నెలకొన్న వ్యాక్సిన్ అసమానతలపై చర్చించామని తెలిపారు. త్వరలోనే ప్రపంచంలోని జనాభా లో 70 శాతం మందికి టీకా వచ్చేలా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. కరోనా మహమ్మారిని అంతం చేయడానికి అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అసమానతలు లేకుండా టీకాలను అన్ని దేశాల్లో పంపిణీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

చైనా ల్యాబ్ లో కరోనా పుట్టిందన్న వాదనను ఆ దేశం కొట్టివేసింది. అయితే వైరస్ మూలాల అధ్యయనం కోసం సమాచారాన్ని అడిగితే... రోగుల భద్రత దృష్ట్యా ఇవ్వబోమని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఆ వైరస్ ను ల్యాబ్ లో సృష్టించలేమని చెప్పింది. అది జంతువుల నుంచే పుట్టి ఉంటుందని చైనా పేర్కొంది. ఈ వాదనకు డబ్ల్యూహెచ్ఓ అప్పుడు మద్దతు పలికింది.

అయితే డ్రాగన్ దేశంలో ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మూలాల అధ్యయనానికి చైనా అంగీకరించింది. అంతర్జాతీయ బృందం SAGO కు స్వాగతం పలికింది. అయితే మూలాలు తెలిస్తే... వైరస్ అంతానికి ఆస్కారం ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కాగా ఇది కూడా నాటకీయ పరిణామమని సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టేందుకు డబ్ల్యూహెచ్ఓ చైనాతో మళ్లీ చర్చలు జరుపుతోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.