Begin typing your search above and press return to search.

మోడీకి స్వాగతం పలికే వేళలో.. మాస్కు తీసేసిన తలసాని

By:  Tupaki Desk   |   6 Feb 2022 4:31 AM GMT
మోడీకి స్వాగతం పలికే వేళలో.. మాస్కు తీసేసిన తలసాని
X
తాను చెప్పే మాటలకు చేసే చేష్టలకు ఏ మాత్రం పొంతన ఉండదన్న విషయాన్ని మరోసారి చేతల్లో చూపించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని స్వాగతం పలుకకుండా ముఖం చాటేయటం ద్వారా.. మోడీతో తాను కయ్యానికి సిద్ధమైన విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి. మిగిలిన పంచాయితీలు ఎలా ఉన్నా.. దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు రాజకీయాల్ని పక్కన పెట్టి.. అత్యున్నత స్థానంలో ఉన్న ఆయనకు స్వాగతం పలకాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

తాను హాజరు కావట్లేదని ఒకసారి.. హాజరవుతున్నట్లు మరోసారి సమాచారం ఇచ్చిన కేసీఆర్.. మోడీ టూర్ కు ఎగనామం పెట్టటం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు.. వీడ్కోలు చెప్పేందుకు హాజరు కాకపోవటం ఒక ఎత్తు అయితే.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పంపటం మరో ఎత్తుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికే వేళలో మంత్రి తలసాని వ్యవహరించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మంత్రి తలసాని ముఖానికి మాస్కు పెట్టుకున్నారు. కానీ.. రన్ వే మీద ప్రధాని విమానం ల్యాండ్ అయిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికే సమయంలో మంత్రి తలసాని తన ముఖానికి ఉన్న మాస్కును తీసేశారు. ప్రధాని మోడీ మొదలు కొని చుట్టు ఉన్న వారంతా (భద్రతా సిబ్బందితో సహా) ముఖానికి మాస్కు ధరిస్తే.. తలసాని మాత్రం ముఖానికి మాస్కును తీసేసి స్వాగతం పలికిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. తనను గుర్తించాలన్న తపనతోనే ఆయన అలా చేశారన్న మాట వినిపిస్తోంది. కరోనా వేళ.. ఇలాంటి తీరు ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.