Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానిపై కేంద్రం ఎందుకలా చేస్తోంది ?

By:  Tupaki Desk   |   8 July 2021 11:37 AM GMT
ఏపీ రాజధానిపై కేంద్రం ఎందుకలా చేస్తోంది ?
X
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పదేళ్లు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ అని చెప్పాలా? లేక అమరావతి అని చెప్పాలా ? లేక జగన్ ప్రభుత్వం కొత్తగా తెరపైకి తీసుకొచ్చినట్టు మూడు రాజధానులు అని చెప్పాలా? అని చాలామంది తికమక పడుతున్నారు. అయితే , దేశ రాజధాని ఢిల్లీ లో జరుగుతున్న కొన్ని పరిణామాలని క్షుణ్ణంగా పరిశీలిస్తే జగన్ ప్రభుత్వం చెప్పినట్టు మూడు రాజధానులకి కేంద్రం కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గత కొద్దిరోజులుగా కేంద్రం నుంచి రాష్ట్రాధికారులకు వస్తున్న లేఖలు, సర్క్యూలర్‌ లపై ఆంధ్రప్రదేశ్‌- హైదరాబాద్‌ అని ఉంటోంది. పాత అలవాటు ప్రకారం అలా పెట్టి ఉంటారని రాష్ట్ర అధికారులు భావిస్తూ వచ్చారు.

కానీ, ఇప్పుడు సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ చెప్పిన విషయాలు పరిశీలిస్తే ఏపీకి మూడు రాజధానులున్నాయని కేంద్రం సైతం నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని వ్యవహారంపై ఒకవైపు హైకోర్టులో కేసులు గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వమే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజధాని ఏది, ఏపీలో పేదలకోసం ఎన్ని ఇళ్లు కట్టారు, రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఎంత మంజూరు చేశారు ఏపీలో స్మార్ట్‌సిటీలకు ఎన్ని నిధులు ఇచ్చారు, ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను కేంద్రం గుర్తించిందా? అంటూ హైదరాబాద్‌కు చెందిన చైతన్యకుమార్‌రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు కేంద్రం దాదాపుగా ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయి అన్నట్టుగానే సమాధానం ఇచ్చింది.

ఇదే ప్రశ్న గతంలో అడిగినప్పుడు ఇది ఆర్టీఐ పరిధిలోకి రాదంటూ సమాధానం ఇచ్చింది.అయితే తానేమీ దేశ రక్షణ రహస్యాలు అడగడం లేదని, రాష్ట్ర రాజధాని ఏదో తెలుసుకోవాలనుకుంటున్నానని తనకు సమాధానం ఇవ్వకపోతే కోర్టుకు వెళతానని చైతన్యకుమార్‌రెడ్డి స్పష్టం చేయడంతో కేంద్ర హోం శాఖ బుధవారం ఆయనకు సమాధానం పంపించింది. అందులో ఒకటి నుంచి ఐదువరకు ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ రాజధాని ఏది మొదలుకొని, మూడు రాజధానులను కేంద్రం గుర్తించిందా అన్న ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సమాధానమిచ్చింది. ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణ- అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం తీసుకొచ్చి మూడు రాజధానులను ఏర్పాటు చేసిందని, రాష్ట్ర రాజధాని నగరం ఏదన్నది, ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని సమాధానం ఇచ్చింది. ఇక్కడే కేంద్ర వైఖరిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఇప్పుడు ఏది ఉందో అదే చెప్పాలి. మూడు రాజధానులను కేంద్రం అంగీకరించిందా అన్న ప్రశ్నకు వారికి ఇష్టమైన సమాధానం చెప్పవచ్చు. కానీ కేంద్రం ఇచ్చిన సమాధానాల్లో అమరావతి అన్న పదం ఎక్కడా లేదు. అంటే ప్రస్తుత రాజధానిగా అమరావతిని గుర్తించనట్లే కనిపిస్తోంది. అధికారికంగా హైదరాబాద్ ను చూపిస్తున్నారు.

దీన్ని బట్టి చూస్తే ..కేంద్రం కూడా మూడు రాజధానుల విషయంలో సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మూడు రాజధానులను కేంద్రం గుర్తించగానే ..కర్నూలుకు హైకోర్టు తరలింపు కోసం తొందరలోనే రీ నోటిఫికేషన్ రావటం ఖాయమని స్పష్టం అవుతోంది. హైకోర్టు తరలింపుకు కేంద్రం రీ నోటిఫికేషన్ జారీ చేయటం కోసమే సీఎం జగన్ ఎదురుచూస్తున్నారు. కేంద్రంఆపని చేసిన వెంటనే పరిపాలనా రాజధాని వైజాగ్ కు తరలించడం క్షణాల్లో జరిగిపోతుంది.ఆ తర్వాత అమరావతి శాసనరాజధానిగా మాత్రమే కొనసాగుతుంది. గతంలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల రాజధానుల నిర్ణయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని అప్పట్లోనే కేంద్ర న్యాయశాఖ చాలా స్పష్టంగా ఒకటికి మూడుసార్లు అఫిడవిట్లు ఇచ్చింది. అయితే , ప్రస్తుతం కేంద్రం వ్యవహారశైలిని పరిశీలిస్తే మూడు రాజధానుల ప్రకటన చాలా త్వరగానే వెలువడే అవకాశం లేకపోలేదు.