Begin typing your search above and press return to search.

మళ్లీ వార్తల్లోకి ఎక్కిన నిత్యానందస్వామి

By:  Tupaki Desk   |   19 Dec 2018 9:01 AM GMT
మళ్లీ వార్తల్లోకి ఎక్కిన నిత్యానందస్వామి
X
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద మళ్లీ వార్తల్లొకి ఎక్కారు. నిత్యానంద దేశం విడిచి పారిపోయాడని పలు జాతీయ మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి. దీనికి ఊతమిచ్చేలా నెలరోజులుగా నిత్యానంద బయట కనిపించకపోవడంతో ఆయన ఏమయ్యారనే చర్చ జరుగుతోంది.

నిత్యానందకు సన్నిహితులు కూడా ఆయన ఎక్కడున్నారనే సమాధానం చెప్పడం లేదు. స్వామిజీ దేశం విడిచి పారిపోతారని తాము అనుకోవడంలేదని, ఆయన నార్త్ ఇండియాలో ఉండొచ్చని ఆశ్రమంలోని ఒక కీలక వ్యక్తి మీడియాతో వ్యాఖ్యానించారు.

బెంగూళూరు నగర శివారులో నిత్యానందకు ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి వచ్చే భక్తులకు నెలరోజులుగా ఎవరికీ ఆయన దర్శనం ఇవ్వడం లేదు. దీంతో నిత్యానంద దేశం విడిచి పారిపోయారనే చర్చకు తెరలేచింది.

నటి రంజితతో బెడ్ రూంలో సన్నిహితంగా ఉన్న వీడియోలు గతంలో రావడంతో అప్పట్లో నిత్యానంద రాసలీలల స్వామిగా ముద్ర వేయించుకున్నారు. 2010లో ఆశ్రమంలో ఓ భక్తురాలిపై నిత్యానంద అత్యాచారం చేశారన్న అంశంతో అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన ఒకనొక దశలో తాను మగాడిని కాదని.. అలాంటప్పుడు తాను రేప్ ఎలా చేస్తానంటూ వాదించాడు. దీంతో ఆయనకు లైంగిక సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించారు.

ఇటీవల సుప్రీం కోర్టు 2010లో జరిగిన అత్యాచారం కేసును వెంటనే పూర్తి చేయాలని స్థానిక కోర్టును ఆదేశించింది. దీంతో మూడు నెలలుగా కేసు విచారణ జరుగుతోంది. ఈనేపథ్యంలోనే నిత్యానంద పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. కాగా ఇటీవలే నిత్యానంద పాస్ పోర్టు గడువు ముగిసింది. తిరిగి రెన్యూవల్ కాలేదని దీంతో దేశం విడిచి పారిపోయే అవకాశాలు తక్కువని బెంగూళూరు ఐజీ దయానంద తెలిపారు.