Begin typing your search above and press return to search.

కొవిడ్ అంతం ఎప్పుడు..? పరిశోధకులు ఏం అంటున్నారు..?

By:  Tupaki Desk   |   3 Feb 2022 11:32 AM GMT
కొవిడ్ అంతం ఎప్పుడు..? పరిశోధకులు ఏం అంటున్నారు..?
X
రెండున్నరేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. చాలా దేశాల్లో లక్షల సంఖ్యలో కొవిడ్ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. వైరస్ బారిన పడిన చాలా మంది చనిపోతున్నారు. కేవలం ఒక్క రోజులోనే 30 లక్షల మందికి కరోనా మహమ్మారి సోకిందని గణాంకాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఒక్క రోజే ఏకంగా 11 వేల మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఫ్రాన్స్ లో కేవలం ఒక్క రోజులోనే మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ దేశం లో వైరస్ కారణంగా 276 మంది మృత్యువాత పడ్డారు. మరో వైపు అగ్రరాజ్యం అయిన అమెరికాలో కూడా వైరస్ కేసులు మరోసారి మూడు లక్షలు దాటాయి. అందులోనూ దాదాపు మూడు వేలకు పైగా కొవిడ్ మరణాలు నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే భారతదేశంలో కూడా వైరస్ కేసులు తగ్గినట్లే తగ్గి మరోసారి పెరిగాయి. ఈ కేవలం ఒక్క రోజులోనే 1.72 లక్షల మంది కొవిడ్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య గతంతో పోలిస్తే మరోసారి పెరిగింది. ఈ ఒక్క రోజులోనే వెయ్యి మందికి పైగా వైరస్ తో చనిపోయారు. మరోవైపు దేశంలో రోజువారీ పాజిటివ్ రేటు కొంచెం తగ్గి 10.99గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కేసులు భారీగా నమోదు అయ్యేందుకు ప్రధాన కారణం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నే అని అధికారులు భావిస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య అమాంత పెరుగుతోందని చెప్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ వైరస్ ప్రతిసారీ తన రూపం మార్చుకుని సరికొత్త వేరియంట్ లతో ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పుట్టుకొచ్చిన కేసుల సంఖ్య చూసిన శాస్త్రవేత్తలు వైరస్ ఎప్పటికీ ముగుస్తుంది అనే దానిపై దృష్టి సారించారు. దీనిపై ఇప్పటికే పరిశోధనలు కూడా ప్రారంభించారు. కొంతమంది ఒమిక్రాన్ చివరిదని అంటే.. మరి కొంతమంది దానిని కొట్టి పారేస్తున్నారు. ఇంకా రెండు వేరియంట్లు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఇటీవల ఓ పరిశోధక బృందం చేపట్టిన పరిశోధనలో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. అవి ఏంటంటే.. కొవిడ్ పై ఇప్పుడు మన దగ్గర ఉన్న టీకాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని అన్నారు. ఈ కారణంగా వైరస్ రానున్న రోజుల్లో తన ప్రభావం తగ్గిపోతుంది చెప్తున్నారు.

ప్రస్తుతం మనకు సాధారణ జ్వరం, తలనొప్పి, జలుబు లాంటివి ఎలా అయితే వస్తాయో అలానే కొవిడ్ కూడా సాధారణ వ్యాధిలానే మారిపోతుందని అభిప్రాయపడ్డారు పరిశోధకులు. అంతేగాకుండా గతంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఓ ముఖ్యమంత్రి చెప్పినట్లు కొవిడ్, మనం కలిసి జీవించాల్సిన రోజులు వస్తాయని అంచనా వేశారు. అంతే తప్ప కొవిడ్ పూర్తిగా అంతం కావడం లాంటిది ఏ మాత్రం ఉండదని చెబుతున్నారు. ఇందుకు నిదర్శనమే ఈ కరోనా వైరస్ రూపాంతరాలు అని అంటున్నారు.