Begin typing your search above and press return to search.

హిమాల‌యాలు క‌రిగిపోతే ఏం జ‌రుగుతుంది?

By:  Tupaki Desk   |   3 Sep 2022 8:30 AM GMT
హిమాల‌యాలు క‌రిగిపోతే ఏం జ‌రుగుతుంది?
X
విప‌రీతంగా చెట్లు న‌రికేయ‌డం, అడ్డ‌దిడ్డంగా నదుల‌పై ప్రాజెక్టుల నిర్మాణం చేప‌ట్ట‌డం, ఇందుకోసం న‌దుల ప్ర‌వాహ మార్గాల‌ను మార్చ‌డం, ఖ‌నిజ వ‌న‌రుల కోసం, ఇసుక కోసం భూమిని త‌వ్వేయ‌డం, ప్లాస్టిక్ వాడ‌కం విచ్చ‌ల‌విడి కావ‌డం, గ్లోబ‌ల్ వార్మింగ్ (భూమి విప‌రీతంగా వేడెక్క‌డం), క‌ర్బ‌న ఉద్గారాలు భారీ స్థాయిలో వెలువ‌డ‌టం వంటి చ‌ర్య‌ల‌తో ప్ర‌పంచానికి ప్ర‌మాదం ముంచుకొస్తుంది. ముఖ్యంగా ఇండియా, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌ త‌దిత‌ర దేశాల్లో తాగు, సాగు నీటికి ఎంతో ఉపయోగ‌ప‌డుతున్న హిమాల‌యాల్లో మంచు త్వ‌ర‌గా క‌రిగిపోతోంద‌ని.. దీంతో 2100 నాటికి ఈ దేశాల‌న్నీ తీవ్ర సాగు, తాగు నీటి కొర‌త‌తో అల్లాడ‌తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం పాకిస్తాన్ లో గ‌త 50 ఏళ్ల‌లో లేని స్థాయిలో తీవ్ర వ‌ర‌ద‌లు రావ‌డానికి హిమనీ న‌దాలు (హిమాల‌యాల్లో పుట్టి ప్ర‌వ‌హించే న‌దులు) క‌రిగిపోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని శాస్త్ర‌వేత్తలు చెబుతున్నారు. 3000 హిమ‌నీ న‌దాలు పాకిస్థాన్‌లోకి వ‌స్తున్నాయ‌ని.. భూమి విప‌రీతంగా వేడెక్క‌డంతో ఇవ‌న్నీ క‌రిగిపోయాయ‌ని అంటున్నారు. దీంతో పాకిస్థాన్ లోని స‌గ భాగం భూమి వ‌ర‌ద‌ల్లో మునిగింద‌ని, 3.30 కోట్ల మంది ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్నార‌ని పేర్కొంటున్నారు.

అలాగే చైనాలో ప‌శ్చిమ ప్రాంతంలోనూ ఉష్ణోగ‌త్ర‌లు విప‌రీతంగా పెర‌గ‌డంతో పంటలు ఎండిపోతున్నాయ‌ని చెబుతున్నారు. చైనా మొత్తానికి ఆహారం పండించ‌గ‌ల సామ‌ర్థ్యం చైనా ప‌శ్చిమ ప్రాంతానికి ఉంద‌ని.. ఇప్పుడు భూతాపోన్న‌తితో ఎండ‌లు పెరిగిపోయి 50 డిగ్రీల కంటే ఎక్కువ‌గా న‌మోదవుతున్నాయ‌ని అంటున్నారు. దీంతో చైనా ఆర్థిక మాంద్యం బారిన‌ప‌డే ప్ర‌మాదం ఉందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

వాతావరణ మార్పులు హిమాల‌యాల‌కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి ఐఐటీ ఇండోర్ శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నంలో తేలింది. హిమాలయాల్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. దీంతో పాకిస్తాన్‌లో వరదల‌ బీభత్సం, చైనాలో కరువు కాటకాలు, భారత్‌లో ఉత్త‌ర భార‌త‌దేశంలోని ఉత్త‌రా ఖండ్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని వాతావరణ మార్పులు... వీటన్నింటికీ హిమాల‌యాలు క‌రిగిపోవ‌డ‌మే కారణమని భారతీయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింద‌ని చెబుతున్నారు. గ‌త కొన్నేళ్లుగా ఐఐటీ ఇండోర్ శాస్త్ర‌వేత్త‌ల బృందం హిమాచల్‌ ప్రదేశ్‌లోని చోటా షిగ్రి హిమానీ నదాన్ని వారు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఈ ఏడాది రికార్డు స్థాయిలో మంచు కరిగిపోయినట్టు వెల్లడైంది. చివ‌ర‌కు వ‌ర‌ద‌ల‌కు వారు ఏర్పాటు చేసుకున్న ల్యాబ్ కూడా కొట్టుకుపోయింది.

"గత మార్చి, ఏప్రిల్‌లో మన దేశంలో ఉష్ణోగ్రతలు 100 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టాయి. హిమానీ నదాలు కరిగిపోవడమే అందుకు కారణం. ఇటీవ‌ల‌ మా బృందమంతా షిగ్రి దగ్గరే ఉండి పరీలించాం. మంచు భారీగా కరిగిపోతోంది" అంటూ ఐఐటీ ఇండోర్ శాస్త్ర‌వేత్త‌ ఆందోళన ఒక‌రు వెలిబుచ్చారు.

అదేవిధంగా "అరేబియా సముద్రంలో అత్యధిక వేడి కారణంగా నీరంతా ఆవిరి మేఘాలుగా మారుతోంది. ఎడతెరిపి లేకుండా వానలు కురిసి లానినో ప్రభావం ఏర్పడింది. దాంతో వాతావరణమే విపత్తుగా మారి ప్ర‌స్తుతం పాకిస్థాన్ ను అతలాకుతలం చేస్తోంది" అని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

గ్లోబల్‌ వార్మింగ్‌ దెబ్బకు హిమాలయాల్లో మంచు గత నాలుగు దశాబ్దాల్లో కరిగిన దాని కంటే 2000–2016 మధ్య ఏకంగా 10 రెట్లు ఎక్కువగా కరిగిపోయింద‌ని శాస్త్ర‌వేత్త‌లు బాంబుపేల్చారు. దక్షిణాసియా (భార‌త్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్గ‌నిస్తాన్, నేపాల్, భూటాన్) దేశాలకు ఇది పెను ప్రమాద హెచ్చరికేన‌ని చెబుతున్నారు.

హిమాల‌యాల్లోని ప‌ర్వ‌త శ్రేణులైన కారకోరం, హిందూకుష్‌ 55 వేల హిమ‌నీ నదాలున్నాయి. హిమాలయ నదులైన గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర మొత్తం 8 దేశాల్లో 130 కోట్ల మంది మంచినీటి అవసరాలు తీరుస్తున్నాయ‌ని అంచ‌నా. ఈ న‌దులు 5,77,000 చదరపు కిలోమీటర్లలో వ్యవసాయ భూములకు నీరందిస్తున్నాయ‌ని చెబుతున్నారు. 26,432 మెగావాట్ల సామర్థ్యం ఉన్న హైడ్రోపవర్‌ స్టేషన్లున్నాయ‌ని అంటున్నారు.

హిమాలయాల్లో మంచు కరిగిపోతే వీటన్నింటిపైనా ప్రభావం పడటమే గాక 2050 నాటికి దక్షిణాసియా దేశాల్లో 170 కోట్ల మందికి నీటికి కటకట తప్పదని ప్రపంచ బ్యాంకు ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దేశాల మధ్య నీటి కోసం యుద్ధాలూ జరిగే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.