Begin typing your search above and press return to search.

2024లో క‌డ‌ప‌లో టీడీపీ పరిస్థితి ఏంటి?

By:  Tupaki Desk   |   2 Feb 2022 12:30 PM GMT
2024లో క‌డ‌ప‌లో టీడీపీ పరిస్థితి ఏంటి?
X
ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌.. ఇది కాంగ్రెస్‌కో.. ఇప్పుడు వైసీపీకో కంచుకోట కాదు. అస‌లు వైఎస్ ఫ్యామిలీకే పెట్ట‌ని కోట‌. 2004లో క‌మ‌లాపురంతో స‌రిపెట్టుకున్న టీడీపీ, 2009లో ప్రొద్దుటూరులో మాత్ర‌మే గెలిచింది. ఇక రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో ఒక్క రాజంపేట‌లో మాత్ర‌మే గెలిచింది. క‌ట్ చేస్తే గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ డ‌క్ అవుట్ అయ్యింది. అన్ని సీట్లలోనూ వైసీపీ స్వీప్ చేసింది. క‌డ‌ప‌, రాజంపేట ఎంపీ సీట్లూ వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. అంటే గ‌త రెండు ద‌శాబ్దాల్లో అస్స‌లు టీడీపీకి క‌డ‌ప జిల్లాలో ఒరిగింది జీరోయే. ఇక్క‌డ టీడీపీ సాధించిన అతి పెద్ద విజ‌యం ఒకే ఒక్క సీటు అంటే ఇక్క‌డ ఆ పార్టీ దుస్థితి ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో అప్ర‌తిహ‌త విజ‌యం సాధించిన వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు దాటేసింది. మ‌రో రెండేళ్ల‌లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఈ సారి క‌డ‌ప జిల్లాలో ఎలా ఉంటుంది. మ‌రోసారి వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లోలాగానే స్వీప్ చేస్తుందా ? లేదా టీడీపీ ఎప్ప‌టిలాగానే ఆ ఒక్క సీటు అయినా గెలుస్తుందా ? అంత‌కు మించి సంచ‌ల‌నాలు ఉంటాయా ? అన్న‌దే ఇప్పుడు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న ప్ర‌ధాన చ‌ర్చ‌. జిల్లాలో రెండున్న‌రేళ్ల వైసీపీ పాల‌న‌లో తీవ్ర‌మైన అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నాయి. అటు వైసీపీ నేత‌ల్లోనూ, ఇటు ప్ర‌జ‌ల్లోనూ ఏమాత్రం సంతృప్తి క‌న‌ప‌డ‌డం లేదు.

టీడీపీ వాళ్లు కొంచెం క‌ష్ట‌ప‌డితే క‌నీసం నాలుగు సీట్ల‌లో సంచ‌ల‌న విజ‌యం సాధిస్తార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. జిల్లాలో ప్రొద్దుటూరు టీడీపీ ఈ సారి ప‌క్క‌గా గెలిచే సీటు అంటున్నారు. టీడీపీ ఇన్‌చార్జ్ ఉక్కు ప్ర‌వీణ్‌రెడ్డి దూసుకుపోవ‌డంతో పాటు అక్క‌డ వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌కు తోడు.. ఎమ్మెల్సీ ర‌మేష్‌యాద‌వ్ వ‌ర్గాన్ని ఎమ్మెల్యే అణిచి వేస్తుండ‌డం.. ఇవ‌న్నీ ఆయ‌న‌కు మైన‌స్ అవుతున్నాయి.

ఇక పార్టీ ఒక‌ప్పుడు కంచుకోట‌గా ఉన్న ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం రైల్వేకోడూరులో కూడా ఈ సారి టీడీపీ గెలిచే ఛాన్సులు ఉన్నాయి. 2014లోనే ఈ సీటును టీడీపీ 2 వేల ఓట్ల తేడాతో కోల్పోయింది. ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు నాలుగు సార్లు గెల‌వ‌డం... అభివృద్ధి లేక‌పోవ‌డం.. ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉండ‌డం ఆయ‌న‌కు మైన‌స్‌గా మారింది. టీడీపీ గ్రూపుల గోల ప‌క్క‌న పెట్టేసి కాస్త క‌ష్ట‌ప‌డితే గెలుపు ఖాయం.

ఇక మైదుకూరులో ఈ సారి మార్పు క‌న‌ప‌డుతోంది. ఇటీవ‌ల మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో సైతం వైసీపీ చావుత‌ప్పి క‌న్నులొట్ట‌బోయినట్టుగా గెలిచింది. ఇక 2014లో టీడీపీ గెలిచిన రాజంపేట‌లో మేడా మ‌ల్లిఖార్జున రెడ్డి పార్టీలు మారి వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యే అవ్వ‌డంతో... రాజంపేట‌ను కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రం చేయ‌డం కూడా అక్క‌డ ప్ర‌జ‌లు భ‌గ్గుమంటున్నారు. దీంతో పాటు క‌మ‌లాపురంలోనూ టీడీపీకి ఛాన్సులు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే జ‌మ్మ‌ల‌మ‌డుగులో భూపేష్‌రెడ్డి వ‌చ్చాక టీడీపీ ఆశ‌లు చిగిరిస్తున్నాయి. పైన చెప్పిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ సారి 3-4 సీట్ల‌లో సైకిల్‌కు ఛాన్సులు ఉన్నాయి.