Begin typing your search above and press return to search.

సాగర్ ప్రాజెక్టు వద్ద ఇప్పుడు పరిస్థితేంటి?

By:  Tupaki Desk   |   1 July 2021 4:35 AM GMT
సాగర్ ప్రాజెక్టు వద్ద ఇప్పుడు పరిస్థితేంటి?
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం అంతకంతకూ ముదురుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మొదలైన ఆరోపణల పర్వం.. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి తెర తీస్తోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు దూకుడుగా వ్యవహరిస్తుంటే.. ఏపీ మంత్రులు ఆచితూచి అన్నట్లుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా నాగార్జున సాగర్ వద్ద తెలంగాణ ప్రభుత్వం తప్పులు చేస్తుందంటూ ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

అనుమతి లేకున్నా.. నీటిని తోడేస్తూ విద్యుదుత్పత్తి చేస్తున్నారంటూ ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం.. తాము తప్పు చేయటం లేదంటూ సమర్థించుకుంటోంది. ఇలాంటి వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య టెన్షన్ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే.. సాగర్ ప్రాజెక్టు ప్రధాన జల విద్యుత్ కేంద్రం.. పులిచింతల ప్రాజెక్టు వద్ద విద్యుదుత్పత్తికి ఆటంకం కలగకుండా ఉండేందుకు భద్రతను ఒక్కసారిగా పెంచారు.

అంతేకాదు.. ఆంధ్ర.. తెలంగాణ సరిహద్దు వద్ద ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేసి.. ఉత్పాదన కేంద్రంలోకి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరవాత మాత్రమే అనుమతిస్తున్నారు. ఇద్దరు డీఎస్పీలు.. ఆరుగురు సీఐలు.. పదహారు మంది ఎస్ఐలతో సహా మొత్తం 300 మంది సిబ్బందిని భద్రత కోసం పర్యవేక్షిస్తున్నారు. వీరిలో గ్రేహౌండ్స్ దళాలు కూడా సాగర్ వద్దకు చేరుకోవటంతో.. అక్కడ పరిస్థితి గంభీరంగా మారిపోయింది.