Begin typing your search above and press return to search.

ఫ్లైట్ జర్నీ తర్వాత ఏం జరుగుతుంది?

By:  Tupaki Desk   |   25 May 2020 5:15 AM GMT
ఫ్లైట్ జర్నీ తర్వాత ఏం జరుగుతుంది?
X
నెత్తిన పిడుగు పడిన చందంగా.. దేశం మీద లాక్ డౌన్ పిడుగు వేసిన మోడీ సర్కారు.. ఎప్పటికప్పుడు పొడిగించటం తెలిసిందే. ఇటీవలే లాక్ డౌన్ పొడిగించినా.. పలు అంశాల్లో సడలింపులు ఇవ్వటం తెలిసిందే. దేశంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు షురూ కానున్నాయి. విమానంలో ప్రయాణించిన వారు.. తమ గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత ఏం జరుగుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

లాక్ డౌన్ వేళ.. ఏదైనా రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి రోడ్డు రవాణాలో వస్తే.. వారికి క్వారంటైన్ విధించటం తెలిసిందే. మరి.. విమాన ప్రయాణం చేసిన వారి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ విషయంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమదైన నిర్ణయాలు తీసుకోవటంతో ప్రయాణికులకు కొత్త తలనొప్పి మొదలైనట్లే.

దీంతో.. ప్రయాణం పూర్తి అయ్యాక ఏదైనా కొత్త సమస్యలు వస్తే.. ఇరుక్కుపోయే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో.. పలువురు తాము బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. గడిచిన వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. దేశీయంగా విమాన సర్వీసుల్ని నిర్వహించటంపైన పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ.. కేంద్రం విమాన సర్వీసుల్ని స్టార్ట్ చేయాలని భావించటంతో ఈ రోజు నుంచి పలు విమానాలు ఎగరనున్నాయి.

విమాన ప్రయాణం చేసి వచ్చిన ప్రయాణికుల విషయంలో తాము అనుసరించే విధానాల గురించి తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. విమాన ప్రయాణం ముగిసిన తర్వాత పరీక్షలు జరుపుతామని.. రోగ లక్షణాలు లేకుంటే వారిని నేరుగా ఇంటికే పంపుతామని చెప్పారు. ఇదే విధానాన్ని ఏపీలోనూ అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక.. కర్ణాటక ప్రభుత్వం అయితే విమాన ప్రయాణికుల్ని ఏడు రోజులు హోటల్లో.. మరో ఏడు రోజులు ఇంట్లో క్వారంటైన్ తప్పనిసరిగా పేర్కొంటోంది. మహారాష్ట్రలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పుడిప్పుడు విమాన సర్వీసుల్ని షురూ చేయొద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుతున్నారు.

తుఫాను తీవ్రతతో పాటు.. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న వేళ.. విమాన సర్వీసుల్ని ఈ నెల 28 నుంచి ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. పలు రాష్ట్రాలు రోడ్డు.. రైలు మార్గాల్లో వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ విషయంలో ఎలాంటి విధివిధానాల్ని అమలు చేస్తున్నారో.. అదే విధానాన్ని విమానప్రయాణికులకు అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణం చేసే వారు.. తాము వెళ్లే రాష్ట్రంలో ఎలాంటి పద్దతిని ఫాలో అవుతున్నారో తెలుసుకున్న తర్వాతే జర్నీ పెట్టుకుంటే మంచిది. లేకుంటే మరో కొత్త సమస్యలో చిక్కుకునే అవకాశం ఉంది.