Begin typing your search above and press return to search.

అయోధ్య కేసు.. ఏదో జరగబోతోంది?

By:  Tupaki Desk   |   5 Nov 2019 4:14 PM IST
అయోధ్య కేసు.. ఏదో జరగబోతోంది?
X
సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు వెలువరించడానికి సుప్రీం కోర్టు రెడీ అయినట్టు కనిపిస్తోంది. హిందూ-ముస్లింల మధ్య 1992 నుంచి మొదలైన ఈ వివాదంపై విచారణ ముగిసి సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఏ రోజైనా ఈ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో దేశమంతా ఉత్కంఠ నెలకొంది.

రామమందిరం-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పుకు రెడీ అయిన నేపథ్యంలో ఈ స్థలం ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు భారీగా బలగాలను మోహరిస్తున్నారు. అయోధ్య ఉన్న ఉత్తర ప్రదేశ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటోంది.

తాజాగా యూపీకి పెద్ద ఎత్తున పారామిలటరీ బలగాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రంలో 15 కంపెనీల అదనపు పారా మిలటరీ దళాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈనెల 11న బీఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ దళాలకు చెందిన సాయుధ బలగాలను యూపీకి పంపించనున్నారు.

ముఖ్యంగా సున్నిత ప్రాంతాలైన లక్నో, అలీఘర్, ఆజంఘడ్, కాన్పూర్, వారణాసి మొదలైన 12 ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరిస్తున్నారు. దీంతో అయోధ్య కేసుపై అంతిమ తీర్పు రాబోతోందని అర్థమవుతోంది.