Begin typing your search above and press return to search.

‘విజయ్​ దివస్’ సరే.. మరి ఈ విషాదగాథ మాటేమిటి?

By:  Tupaki Desk   |   18 Dec 2020 1:30 AM GMT
‘విజయ్​ దివస్’ సరే.. మరి ఈ  విషాదగాథ మాటేమిటి?
X
ఎందరో అమరవీరులు చరిత్రగతుల్లో కలిసిపోతారు. యుద్ధం చేసినా.. ఎదురులేని పోరాటాలు చేసినా భవిష్యత్​ తరాలకు వాళ్ల పేర్లు తెలియవు. అజ్ఞాత వీరులుగానే మిగిలిపోతారు. 1971 యుద్ధంలోనూ అటువంటి వీరులు ఉన్నారు. ఆ ఏడు పాకిస్థాన్​పై భారత్​ ఘనవిజయం సాధించింది. ఈ విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా డిసెంబర్​ 16న విజయ్​దివస్​గా జరుపుకుంటున్నాము. ఈ యుద్ధం ముగిసి 50 ఏళ్లు గడిచింది. అమరులను దేశం మొత్తం స్మరించుకుంటున్నది. కానీ అప్పటి యుద్ధంలో కొందరు అదృశ్యమయ్యారు. వారి గురించి ఇప్పటికీ పట్టించుకొనేవాళ్లు లేరు.

బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు 1971లో ఇండియా .. పాకిస్థాన్​తో తలపడింది. అయితే ఈ సమయంలో 54 మంది భారతసైనికులు కనిపించకుండా పోయారు. వారిని పాక్​సైన్యం కాల్చిచంపిందా? బంధీలుగా తీసుకెళ్లిందా? అన్న విషయం ఇప్పటివరకు తెలియదు. అయితే వారి ఆచూకి మాత్రం ఇప్పటివరకు తెలియదు. వారు ఇప్పటికీ పాకిస్థాన్​లో బంధీలుగా ఉండి ఉంటారని కుటుంబసభ్యులు నమ్ముతున్నారు. కాగా ఈ విషయంపై మాత్రం ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆమిర్‌ అబ్దుల్లా ఖాన్‌ నాయిజీతో సహా 93 వేల మంది పాక్‌ సైనికులు భారత దళాల ఎదుట బేషరతుగా లొంగిపోవడంతో అప్పట్లో యుద్ధం ముగిసింది. భారత్‌ విజయంతో బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది.

ఆ యుద్ధ సమయంలో కొందరు సైనికులు పాకిస్థాన్​కు బందీలుగా మారారు. వారిని పాక్​ చంపేసిందా? వాళ్లకు ఏం జరిగింది? అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. యుద్ధం సమయంలో ప్రత్యర్థులకు ప్రాణాలతో దొరకడం చాలా ప్రమాదం. అయితే పాక్​ చేతిలో బంధీలుగా ఉన్న ఆ 54 మంది ఆచూకీ మాత్రం తెలియడం లేదు. అయితే సోనూ సుద్​ అనే సైనికుడు తాము పాకిస్థాన్​లో చిక్కుకున్నామని.. డిసెంబరు 26, 1974న భారత్‌లోని ఆర్‌ఎస్‌ సురికి లేఖ రాశారు. 1975 ఆగస్టులో అశోక్‌ అనే సైనికుడు తన తండ్రికి.. ‘ప్రియమైన నాన్న.. ఆశీర్వాదం కోసం అశోక్‌ మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. నేనిక్కడ బాగానే ఉన్నాను. ఇండియన్‌ ఆర్మీ, భారత ప్రభుత్వంతో మా గురించి మాట్లాడండి. మేమిక్కడ 20 మంది ఆఫీసర్లం ఉన్నాం. నా గురించి బాధ పడొద్దు’ అంటూ లేఖ రాశాడు.

అయితే అదృశ్యమైన వాళ్ల ఆచూకీ కోసం ఎందరో జర్నలిస్టులు పరిశోధన సాగించారు. ఇరు దేశాలు పెద్దగా పట్టించుకోలేదు. తప్పిపోయిన ఆ 54 మందిలో కొందరు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అయితే భారత ప్రభుత్వం ఓ సారి ఆ 54 మందిలో 20 మంది వీరమరణం పొందారని.. మరోసారి వారంతా పాకిస్థాన్​లో బంధీలుగా ఉన్నారని ప్రకటించింది. దీంతో ఇప్పటికీ ఆ గందరగోళం అలాగే కొనసాగుతోంది.