Begin typing your search above and press return to search.

ఆర్యన్ ను బుక్ చేసినప్పుడు ‘బీజేపీ’ వాళ్లు ఎందుకు ఉన్నారు?

By:  Tupaki Desk   |   7 Oct 2021 3:20 AM GMT
ఆర్యన్ ను బుక్ చేసినప్పుడు ‘బీజేపీ’ వాళ్లు ఎందుకు ఉన్నారు?
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు డ్రగ్స్ ఉదంతం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. మొదట్లో ఆర్యన్ ఖాన్ అరెస్టు విషయం మీద నెగిటివ్ వ్యాఖ్యలు వినిపిస్తున్నా.. ఇప్పుడు మరో కొత్త వాదనకు బలం పెరుగుతోంది. కావాలనే.. ఆర్యన్ ను టార్గెట్ చేసి మరీ ఇరికించినట్లుగా వాదనలు తెర మీదకు వస్తున్నాయి. పదిహేను వందల మందితో ఉన్న క్రూయిజ్ లో విచారణ అధికారులు నేరుగా ఆర్యన్ అతని స్నేహితుల్నే ఎందుకు టార్గెట్ చేశారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

నిజానికి బెయిల్ కోసంప్రయత్నం చేసినప్పుడు కూడా.. ఈ సందేహాల్ని వ్యక్తం చేసినప్పటికి కోర్టు మాత్రం బెయిల్ మంజూరు చేసేందుకు అనుమతించలేదు. ఇదిలా ఉంటే.. క్రూయిజ్ లో తనిఖీ చేసిన వేళలో.. అధికారులతో పాటు ఉన్న వారి ఐడెంటిటీ మీద కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ నార్కొటిక్ బ్యూరోజరిపినట్లుగా చెబుతున్న సోదాలన్ని ఉత్త డ్రామాలని.. నకిలీవిగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర మంత్రి నవాజ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రైడ్ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను ఆయన విడుదల చేస్తూ.. అందులో ఒక వీడియోలో ఆర్యన్ ఎస్కార్ట్ చేస్తూ గోస్వామి అనే వ్యక్తి కనిపించాడు. అయితే.. అతను ఎన్ సీబీ అధికారి కాదని.. సోషల్ మీడియాలోని అతడి ప్రొఫైల్ ప్రకారం అతనో ప్రైవేట్ డిటెక్టివ్ గా మంత్రి ఆరోపిస్తున్నారు.

వీడియోలో కనిపించిన వారు అధికారులు కానప్పుడు.. తనిఖీ వేళలో వారు అక్కడ ఏం చేస్తున్నట్లు అంటూ సూటిగా ప్రశ్నించారు. బాలీవుడ్ ను.. తమ ప్రభుత్వాన్ని మకిలి పట్టించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు టార్గెట్ చేసినట్లుగా చెబుతున్నారు. అరెస్టు వేళ అర్బాజ్ మర్చంట్ తో పాటు కనిపించిన వ్యక్తి గుజరాత్ లో సెప్టెంబరు 21-22 తేదీల్లో కనిపించామని.. అతనికి ముంద్రా పోర్టులో లభించిన డ్రగ్స్ సంబంధం ఉండొచ్చని చెబుతున్నారు.

క్రూయిజ్ లో సోదాలు జరుగుతున్న సమయంలో తాను అక్కడే ఉన్నట్లుగా మనీశ్ భన్సాలీ ఒప్పుకుంటున్నారు. తాను బీజేపీ కార్యకర్తనేనని.. కానీ ఏ నేతను ఇంతవరకు తాను కలవలేదన్నారు. అక్టోబరు ఒకటిన తనకు డ్రగ్స్ పార్టీ గురించి సమాచారం అందిందని.. ఆ విషయాన్ని ఎన్ సీబీకి చెప్పాలని తన స్నేహితుడు చెప్పటంతో తాను ఇచ్చానన్నారు. దీంతో.. సాక్షిగా తాను ఆ సంఘటనలో ఉన్నానే తప్పించి.. మరే కారణం లేదని వివరణ ఇస్తున్నారు.

మొత్తంగా ఈ వ్యవహారంలోకి ‘బీజేపీ’ రావటం ద్వారా.. విషయం పక్కదారి పట్టేలా ప్లాన్ జరుగుతోందన్న మాట వినిపిస్తోంది. మరీ.. బయటకు వస్తున్న వాదనల్లో నిజం ఎంత? అసలేం జరిగింది? ఏం జరుగుతుందన్నది తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.