Begin typing your search above and press return to search.

కాపులు పాకిస్తాన్ నుంచి వ‌చ్చారా?!

By:  Tupaki Desk   |   9 Dec 2016 6:18 AM GMT
కాపులు పాకిస్తాన్ నుంచి వ‌చ్చారా?!
X
కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండుతో సత్యాగ్రహ పాదయాత్ర చేయాలని భావిస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త‌న ఆక్రోశాన్ని మ‌రోమారు వెళ్ల‌గ‌క్కారు. పాద‌యాత్ర చేసేందుకు తనను అనుమతి తీసుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు గతంలో ఆయన ప్ర‌తిపక్ష నేతగా జరిపిన పాదయాత్రకు ఎవరి నుండి అనుమతి తీసుకున్నారో చెప్పాలని ముద్రగడ పద్మనాభం కోరారు. ఆ అనుమతి పత్రాలు తనకు చూపితే, తాను అదే రీతిలో అనుమతి కోరతానని ఎద్దేవా చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఏపీ సీఎం తీరుపై మండిప‌డ్డారు.


విప‌క్ష నేతా ఉన్న స‌మ‌యంలో చంద్రబాబు రోడ్డు మార్జిన్ గీత‌పై మళ్లీ రోడ్డు వేసుకుని పాదయాత్ర సాగించారని, ఇలా వేసుకోవడానికి ఎవరి అనుమతి కోరారో తెలపాలని ముద్ర‌గ‌డ డిమాండ్ చేశారు. అలాగే ప్రస్తుత విపక్ష నేత జగన్ పోలవరం పాదయాత్ర చేశారని, షర్మిల ఓదార్పు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. దీంతో పాటుగా సీపీఎం, సీపీఐ తరచూ యాత్రలు చేస్తాయని, గడగడపకూ వైసీపీ యాత్ర చేశారని, దేశం పార్టీ జనచైతన్య యాత్రలు చేశాయని వాటికి ఎటువంటి అనుమతులు ఇచ్చారో నకలు ప‌త్రాలు ఇస్తే పరిశీలిస్తానన్నారు. ఎవరికీ లేని నిబంధనలు తమ జాతికి ఎందుకని ప్రశ్నించారు. కాపుల కోసం ప్రత్యేక రాజ్యాంగం రాశారా అని ముద్ర‌గ‌డ నిల‌దీశారు. కాపులు పాకిస్తాన్ నుంచో ఇరాన్, ఇరాక్ నుంచో రాలేదని, అనుమతి తీసుకోవాలని ఏ చట్టంలో ఉందో తెలపాలని డీజీపీని కోరిన‌ట్లు వివ‌రించారు. దీనిపై ఇంతవరకూ ముఖ్యమంత్రి సమాధానం చెప్పడంలేదని, దానిపై ఆయన సమాధానాన్ని కోరాలని విలేఖర్లను ముద్రగడ కోరారు. రావులపాలెంలో పాదయాత్రను ఆపినా దానిని చేసి తీరాలని నిర్ణయించినట్లు ముద్రగడ తెలిపారు.

త‌మ కార్యాచ‌ర‌ణను ముద్ర‌గ‌డ ప‌ద్మానాభం వివ‌రిస్తూ...ఈ నెల 18న నోటికి రిబ్బను కట్టుకొని గరిటెలు, ప్లేట్లతో చప్పుడు చేయాలని కాపులు ఎక్కడైతే ఉన్నారో ఆయా గ్రామాల్లో మండలాల్లో వీలైనంతసేపు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ నెల 30న ప్రజాప్రతినిధులకు నియోజవర్గ ప్రధాన కేంద్రాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. జనవరి 9న రాత్రి 7 గంటలకు కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని నిర్ణయించామన్నారు. జనవరి 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ కాపు సత్యాగ్రహయాత్ర జరుపుతామన్నారు. సత్యాగ్రహయాత్ర అనంతరం ఫిబ్రవరిలో జెఎసి సమావేశమై మరలా ఏవిధమైన కార్యక్రమాలు చేయాలో నిర్ణయిస్తుందన్నారు. ఏదేమైనా ఈ కార్యక్రమం పూర్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాష్ట్రం విడిపోవడంతో ప్రస్తుతం కాపుల ప్రాధాన్యత పెరిగిందని కాపుల ఓట్లు లేనిదే ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాదని గ్రహించిన చంద్రబాబు బీసీలలో చేరుస్తానంటూ నమ్మబలికిన హామీతో అధికారాన్ని దక్కించుకున్నారని ముద్రగడ ఆరోపించారు.