Begin typing your search above and press return to search.

సీపీఎస్ ర‌ద్దుపై మాది తొంద‌ర‌పాటు హామీ!

By:  Tupaki Desk   |   8 Sep 2022 6:20 AM GMT
సీపీఎస్ ర‌ద్దుపై మాది తొంద‌ర‌పాటు హామీ!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్)ను పున‌రుద్ద‌రించే ప్రసక్తే లేదని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్) కంటే ఎక్కువ లబ్ధి కలిగేలా గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌)ను త‌యారు చేశామ‌ని వెల్ల‌డించింది. సీపీఎస్ కంటే జీపీఎస్‌ ఎలా మెరుగైనదో వివరిస్తూ ఉద్యోగ సంఘాల‌తో జ‌రిగిన తాజా చ‌ర్చ‌ల్లో వారికి ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. తాము జీపీఎస్‌పైనే ముందుకు వెళ్తున్నట్లు మంత్రుల క‌మిటీ స్పష్టం చేసింది. జీపీఎస్‌కు చట్టబద్ధత కల్పిస్తామని మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు తెలిపారు.

ప్రభుత్వ ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాల నేతలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.పాత పెన్ష‌న్ స్కీమ్ (ఓపీఎస్‌) మినహా మ‌రే ప్రత్యామ్నాయాలకు తాము అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. మ‌రోవైపు మంత్రుల క‌మిటీ తాము జీపీఎస్‌కే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేసింది. ఓపీఎస్‌ పునరుద్ధరణ ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.

మ‌రోవైపు మంత్రుల క‌మిటీతో సెప్టెంబ‌ర్ 7న జ‌రిగిన చ‌ర్చ‌ల‌ను సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. ఏపీజేఏసీ అమరావతి కూడా ఈ భేటీని బహిష్కరించింది. తాము ఓపీఎస్ గురించి అడుగుతుంటే సీపీఎస్‌ విధానంపై చర్చలకు పిలవడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. మంత్రులతో భేటీ అనంతరం ఉద్యోగ‌ సంఘాల నేతలు మాట్లాడారు.

జీపీఎస్‌ అమలు అంటే కొత్త సీసాలో పాత సారా పోయడమేనని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాస్ చెప్పారు. జీపీఎస్‌, సీపీఎస్‌ రెండూ ఒకేవిధంగా ఉంటాయని తెలిపారు.భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. సీపీఎస్‌ రద్దు అవుతుందనే వైఎస్సార్సీపీని గెలిపించామన్నారు. కాగా, ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన జీపీఎస్‌ను ఒప్పుకునేదేలేదని ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు అన్నారు. ఇదే అంశాన్ని మంత్రుల కమిటీలో చెప్పామని తెలిపారు. ఓపీఎస్‌ పునరుద్ధరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.

కాగా టీచర్లపై ప్ర‌భుత్వ‌ వేధింపులతో ఆందోళన నెలకొన్నందున సెప్టెంబ‌ర్ 11న ఆదివారం నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేత‌లు తెలిపారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామని చెప్పి, జీపీఎస్‌ను తెరపైకి తీసుకురావడం దారుణ‌మ‌ని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాస‌రావు మండిప‌డ్డారు.

ఉద్యోగుల సీపీఎస్ ఉద్యమం, ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన‌ నేపథ్యంలో ఆగ‌స్టు చివర్లో రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉద్యోగులపై ప్రభుత్వం కేసులు నమోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో పలు తీవ్రమైన కేసులు కూడా న‌మోదు చేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా జరిగిన చర్చల్లో ఉద్యోగులపై కేసుల నమోదు వ్యవహారం కూడా చర్చకు వచ్చింద‌ని స‌మాచారం.

కేసుల్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని మంత్రుల క‌మిటీని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. అయితే సీఎం జగన్ తో గురువారం (సెప్టెంబ‌ర్ 8) చర్చించిన తర్వాత కేసులపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రుల క‌మిటీ తెలిపింది. దీంతో సీఎం జగన్ కేసులపై నిర్ణయం ప్రకటించనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.