Begin typing your search above and press return to search.

ఏపీలో ఓ వైపు జ‌లప్ర‌ళ‌యం... మ‌రోవైపు క‌రువు

By:  Tupaki Desk   |   16 Aug 2019 4:29 PM GMT
ఏపీలో ఓ వైపు జ‌లప్ర‌ళ‌యం... మ‌రోవైపు క‌రువు
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడిన కడప జిల్లాలో మాత్రం వర్షం పెద్దగా తొంగి చూడలేదు. దీంతో కడప కరువు కోరల్లో చిక్కుకుంది. కడపతో పాటు అనంతపురం జిల్లాలో కూడా కరువు తాండవిస్తోంది. కానీ వరదల వల్ల కృష్ణా నది ఉధ‌తంగా ఉంది. నది పరిధిలో ఉన్న శ్రీశైలం- నాగార్జున సాగర్ ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులు నిండిపోయాయి. అయితే నది పక్కనే ఉన్న రాయలసీమలో చుక్క నీరు అందడంలేదు. అందులోనూ కడప- అనంతపురం జిల్లాల‌ పరిస్థితి దారుణం.

ఈ రెండు జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైంది. దీని వల్ల పంటలతో పాటు, పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఎండిపోయే స్థితికి వచ్చాయి. ఇక చాలావరకు బావులు- బోర్లు- చెరువులు ఎండిపోవడంతో చాలా చోట్ల విత్తనాలు కూడా వేసుకోలేదు. ఇక తాగునీరు కూడా అందక ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే ఊర్లకి ఊరులే తరలి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

ఇప్ప‌టికే చాలా మంది ఇక్క‌డ ప‌నులు లేక బెంగ‌ళూరు- బ‌ళ్లారి- హైద‌రాబాద్ లాంటి న‌గ‌రాల‌కు త‌ర‌లిపోతున్నారు. ప్రస్తుతం ఈ రెండు జిల్లాలో సాగు విస్తీర్ణం దారుణంగా ఉంది. కడపలో మొత్తం 90 శాతం భూములు బీడు మారిపోయి ఉంటే కేవలం 10 శాతం మాత్రమే సాగులో ఉన్నాయి. అటు అనంతపురంలో దాదాపు 29 శాతం సాగు విస్తీర్ణం ఉంది. అయితే ఈ రెండు జిల్లాలు కంటే చిత్తూరు- కర్నూలు పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది.

కర్నూలులో 54.6 శాతం, చిత్తూరు జిల్లాలో 69. 7 శాతం విస్తీర్ణం సాగులోకి వచ్చింది. మొత్తం మీద అనంతపురం- కడప పరిస్థితి మ‌రింత అధ్వాన్నంగా ఉంది. సాగుకి దూరమై కొంతమంది ఉంటే, విత్తనాలు వేసి కొందరు నష్టపోతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా నీరు ఈ జిల్లాలకి తరలిస్తే కొంతవరకైనా వారికి ఊరట లభిస్తుంది. ఏదేమైనా ఏపీలో ఓ వైపు వ‌ర‌ద‌ల‌తో న‌దులు పొంగి పొర్లుతుంటే సీమ జిల్లాలు మాత్రం క‌రువు కోర‌ల్లో చిక్కుకోవ‌డం విచిత్ర‌మే.