Begin typing your search above and press return to search.

ఓపెనింగ్ కోసం రెండేళ్లుగా వెయిటింగ్.. అట్లుంటది మన కేసీఆర్ తోని ముచ్చట!

By:  Tupaki Desk   |   13 July 2022 2:30 PM GMT
ఓపెనింగ్ కోసం రెండేళ్లుగా వెయిటింగ్.. అట్లుంటది మన కేసీఆర్ తోని ముచ్చట!
X
కరోనా తర్వాత సినిమాల కోసం థియేటర్లకు వెళ్లాలా? అన్న డౌట్ వచ్చేసిన వేళ.. అలా కాదులే కానీ.. థియేటర్ కు వెళ్లి సరదాగా మన టిల్లుగాడిని చూసి రావాలె.. మనోడి ముచ్చట చూడాలనిపించేలా చేసిన మూవీ డీజే టిల్లు. ఆ సినిమాలో హీరో పాత్రధారి నోటి నుంచి.. 'అట్లుంటది మనతోని ముచ్చట' అనే మాట తరచూ వస్తుంటుంది. ఆ డైలాగ్ కు ఇట్టే సూట్ అయ్యేలా ఉంటుంది సీఎం కేసీఆర్ తాజా ముచ్చట చూస్తే.

తాను చదువుకున్న బడిని అద్భుతంగా మార్చేయాలన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. ఇప్పుడంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేంత భారీ భవంతుల్లో ఉండే ప్రైవేటు స్కూళ్లలో పిల్లలు చదువుకుంటున్నారు కానీ.. ఓ యాబై ఏళ్ల క్రితం అరకొర వసతులున్న స్కూళ్లలో చదువుకునే పరిస్థితి. అందుకే.. తాము మాంచి పొజిషన్ లోకి వెళ్లాక.. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఇస్కూల్ రుణం తీర్చుకోవటానికి కొందరు తపిస్తుంటారు. అలా తపించే లక్షణం ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు పేరుంది.

అయితే.. ఆయనతో వచ్చే పంచాయితీ ఏమంటే.. ఆలోచనలు ఘనంగా ఉంటాయి కానీ ఆచరణలోకి వచ్చేసరికే లేనిపోని రీతిలో విమర్శలు ఎదుర్కొనేలా ఉంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది.

తాను చదువుకున్న దుబ్బాక ఉన్నత పాఠశాలను పూర్తిగా నేలమట్టం చేసి.. అత్యుద్భత రీతిలో భారీ భవంతిలో స్కూల్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందంగా 2016లో బడిని కూలగొట్టి కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. స్కూల్ తో పాటు జూనియర్ కాలేజీని అందులో పెట్టేస్తూ మూడంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టారు.

రూ.10 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ స్కూల్ భవన నిర్మాణం 2018లో పూర్తి అయ్యింది. రాజమహల్ ను తలపించేలా ఉండే ఈ భవనం ఇప్పటికి అందరికి అందుబాటులోకి రాని పరిస్థితి. దీనికి కారణం.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమయం లేకపోవటమే. ఈ స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పూర్తి చేయాలని చూస్తున్న అధికారులకు.. ఆయన సమయం ఇవ్వకపోవటంతో భారీగా సిద్ధం చేసిన స్కూల్ భవనం నిరుపయోగంగా ఉండిపోయింది. కోట్లాది రూపాయిల ప్రజాధనంతో నిర్మించిన ఇలాంటి భవనాల్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావటం ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.

ప్రగతిభవన్ లోనూ.. ఫార్మర్ హౌస్ లోనూ రోజుల తరబడి గడిపే సీఎం కేసీఆర్.. కాస్త వీలు చేసుకొని తనకు దగ్గర్లో ఉన్న ఇస్కూల్ భవనాన్ని ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది? దేశాన్ని ఉద్దరించేస్తానంటూ భారీ క్లాసులు పీకే గులాబీ బాస్ కు.. తనకు చదువు చెప్పిన స్కూల్ భవన నిర్మాణం పూర్తై రెండేళ్లు కావొస్తున్నా.. తన కోసం వెయిట్ చేస్తుందన్న విషయం ఎందుకు గుర్తుకు రాదు.

రెండేళ్లుగా ఓపెనింగ్ కు నోచుకోని ఈ భవనం పరిసరాల్లో పిచ్చి మొక్కలు మొలవటంతో పాటు.. కిటికీలు ధ్వంసం అయినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఈ భవనం ఇప్పుడు పేకాట రాయిళ్లకు కేరాఫ్ అడ్రస్ గా మారినట్లు చెబుతున్నారు. ఇదంతా చదివిన తర్వాత.. కేసీఆర్ తోని ముచ్చట అట్లుంటుందని అనుకోకుండా ఉండగలమంటారా?