Begin typing your search above and press return to search.

చంద్రబాబు దీక్ష రోజునే దిల్లీలో ‘ఓటుకు నోటు దీక్ష’

By:  Tupaki Desk   |   9 Feb 2019 1:36 PM GMT
చంద్రబాబు దీక్ష రోజునే దిల్లీలో ‘ఓటుకు నోటు దీక్ష’
X
కేంద్రానికి వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 11న దిల్లీలో దీక్ష చేస్తుండగా.. అదే రోజున చంద్రబాబును ఇరుకునపెట్టేలా మరో దీక్ష మొదలవుతోంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు లాంటివారిని విడిచిపెట్టిన నిర్దోషినైన తనను నిందిస్తున్నారని ఆరోపిస్తూ ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జెరూసలెం మత్తయ్య అదే రోజు దిల్లీలో నిరసన దీక్ష చేపడుతున్నారు. మత్తయ్య దీక్షకు పలు క్రైస్తవ సంఘాలు మద్దతిస్తున్నాయి కూడా.

కాగా ఎన్నికలకు ముందే ఓటుకు నోటు కేసులో నిందితులను శిక్షించాలని జెరూసలెం మత్తయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ప్రలోభాలకు గురి చేస్తే, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కేసులో తెలంగాణ సర్కార్ తన పేరు మార్చడాన్ని ఖండించారు. ఈ కేసులో తనను నిర్దోషిగా హైకోర్టు ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 11న ఢిల్లీలో నిరసన చేపడుతున్నట్టు వెల్లడించారు.

చంద్రబాబు మందీమార్బలంతో దిల్లీలో దీక్ష చేస్తున్న రోజునే ఆయనపై ఆరోపణలున్న ఓటుకు నోటు కేసు విషయంలోనూ దీక్ష జరుగుతుండడంతో టీడీపీ ఇరుకునపడుతోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ దీక్షలు చేస్తున్న టీడీపీని ఇబ్బంది పెట్టేందుకే ఇలా మత్తయ్యతో దీక్ష చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.