Begin typing your search above and press return to search.

చ‌స్తే ఇచ్చే ప‌రిహారం బిస్కెట్లు కాదు-కేంద్ర‌మంత్రి

By:  Tupaki Desk   |   3 April 2018 4:27 AM GMT
చ‌స్తే ఇచ్చే ప‌రిహారం బిస్కెట్లు కాదు-కేంద్ర‌మంత్రి
X
ఇరాక్‌లో ఉగ్రవాదుల రక్తదాహానికి బలైన 38 మంది భారతీయుల మృతదేహాలను సోమవారం ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకువచ్చారు. ఉపాధికోసం ఇరాక్‌కు వలస వెళ్లిన కార్మికుల్లో 40 మందిని ఐఎస్ ఉగ్రవాదులు 2014 జూన్‌ లో కిడ్నాప్‌ చేయగా - వారిలో పంజాబ్‌ కు చెందిన ఒకరు తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఉగ్రవాదులు మిగిలిన వారిలో 39 మందిని మోసుల్‌ కు తీసుకువెళ్లి దారుణంగా కాల్చి చంపి అక్కడే పూడ్చి పెట్టారు. ఆ 38 మంది మృతులలో 27 మంది పంజాబ్‌ కు - నలుగురు హిమాచల్‌ ప్రదేశ్‌ కు - మిగిలినవారు బీహార్ - పశ్చిమబెంగాల్ రాష్ర్టాలకు చెందినవారు. ఈ మేరకు సమాచారం అందిందని, మృతులలో ఒకరి అవశేషాలను ఇంకా గుర్తించాల్సి ఉందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇటీవల లోక్‌ సభకు తెలిపారు. మిగిలిన 38 మృతదేహాలను మన దేశానికి తీసుకువస్తామని అన్నారు. ఇందుకోసం విదేశాంగశాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ ను ఆదివారం ఇరాక్‌ కు పంపారు. మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించనున్నారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి విజయ్ కుమార్‌ సింగ్ వివాదాస్ప‌ద వ్యాఖ్యాలు చేశారు. ఇరాక్‌లో ఐఎస్ఐఎస్‌ ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందించడం బిస్కెట్లు పంచడం లాంటిది కాదని అన్నారు. మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరుకున్న తర్వాత ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడమనేది బిస్కెట్లు పంచడంలాంటిది కాదు. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించడానికి తన జేబులో గల్లా పెట్టే లేదు. ఇది ప్రజల జీవితాలకు సంబంధించినది. ఇది ఫుట్‌బాల్‌ ఆట కాదు. బాధిత కుటుంబీకులు వారి విద్యార్హతలతో వివరాలు అందజేశారు. బాధిత కుటుంబీకులకు ఉద్యోగం కల్పించే విషయం పై రాష్ట్రప్రభుత్వానికి సహకరిస్తాం' అని ఆయన అన్నారు. కేసు పెండింగ్‌లో ఉన్నందున మరోక మృతదేహాన్ని తీసుకురాలేదని ఈ సందర్భంగా వికె సింగ్‌ తెలిపారు.

కాగా, ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన 38 మంది భారతీయుల మృతదేహాలు సోమవారం మధ్యాహ్నం భారత్‌కు చేరుకున్నాయి. మృతదేహాలతో బాగ్దాద్‌ నుంచి బయలు దేరిన ఒక ప్రత్యేక విమానం పంజాబ్‌ లోని అమృత్‌ సర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆ విమానం అమృత్‌ సర్ విమానాశ్రయంలో దిగింది. ఈ సందర్భంగా పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు విమానాశ్రయానికి వెళ్లారు. తమ రాష్ర్టానికి చెందిన 27 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రకటించారు.